ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 03 July 2026, 5:34 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలి ఇంచార్జులతో సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు

గోదావరిఖని ,అర్జున్ సమాచారం :

రామగుండం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ SIR–BLA ఇంచార్జులతో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు గారు సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమం పురోగతి, BLAలు చేపట్టాల్సిన బాధ్యతలు, ప్రజలకు అందించాల్సిన సహకారంపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ.. భారత ఎన్నికల కమిషన్ చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం అత్యంత కీలకమైనదని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు హక్కు ఎంతో విలువైనదని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు, BLAలు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ప్రతి బూత్ పరిధిలో ఇంటింటికీ వెళ్లి ప్రజలకు SIR ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించాలని, అవసరమైన దరఖాస్తులు నింపడంలో సహకరించాలని తెలిపారు.
ఓటరు జాబితాలో పేర్లు లేకపోవడం, తప్పులు ఉండడం, చిరునామా మార్పులు, కొత్త ఓటర్ల నమోదు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఎలాంటి అర్హత కలిగిన ఓటరు కూడా జాబితా నుంచి మినహాయించబడకుండా అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎప్పటికప్పుడు అవసరమైన సమాచారం అందించాలని అన్నారు.
టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేస్తూ ప్రతి పోలింగ్ బూత్‌లో SIR ప్రక్రియను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల సందేహాలను నివృత్తి చేస్తూ, ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా ప్రతి దరఖాస్తు సక్రమంగా పూర్తి అయ్యేలా చూడాలని సూచించారు. పార్టీ కార్యకర్తలు సేవాభావంతో పనిచేస్తే ప్రజల్లో మరింత విశ్వాసం పెరుగుతుందని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కార్పోరేటర్లు నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల, గ్రామాల SIR–BLA ఇంచార్జులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.