ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 07 July 2026, 7:59 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ఎన్‌హెచ్-44పై నిఘా మరింత పటిష్ఠం తూప్రాన్ టోల్‌గేట్ కంట్రోల్ రూమ్‌ను తనిఖీ చేసిన అదనపు ఎస్పీ

మెదక్, తూప్రాన్, జులై 7,అర్జున్ సమాచారం:
జాతీయ రహదారి-44పై భద్రతా పర్యవేక్షణను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని మెదక్ జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఐపీఎస్ సూచించారు. మంగళవారం తూప్రాన్ టోల్‌గేట్ వద్ద ఉన్న కంట్రోల్ రూమ్‌ను ఆయన పరిశీలించి సీసీ కెమెరాల పనితీరును తనిఖీ చేశారు.

ఎన్‌హెచ్-44పై వాహనాల రాకపోకలను నిరంతరం పర్యవేక్షిస్తూ అనుమానాస్పద వాహనాలు, వ్యక్తుల కదలికలను వెంటనే గుర్తించి సంబంధిత పోలీసు స్టేషన్లకు సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. సీసీ కెమెరాలు ఎల్లప్పుడూ పనిచేసే స్థితిలో ఉండేలా నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

ఈ సందర్భంగా కంట్రోల్ రూమ్‌లో అత్యవసర పరిస్థితుల్లో సిబ్బంది తీసుకునే చర్యలు, సమాచార సేకరణ, స్థానిక పోలీసు స్టేషన్లతో సమన్వయం, స్పందించే విధానాన్ని అదనపు ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. అత్యవసర సమయంలో ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే స్పందించి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.

సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించడం ద్వారా నేరాల నియంత్రణతో పాటు రహదారి భద్రతను మరింత బలోపేతం చేయవచ్చని అదనపు ఎస్పీ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా అదనపు ఎస్పీ వెంట తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, ఎస్‌ఐ గంగరాజు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.