ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 19 July 2026, 7:27 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ఎమ్మెల్యే మీడియాపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి! జన్నారం బిఆర్ఎస్ నేతల డిమాండ్!!

ఖానాపూర్ ప్రతినిధి, అర్జున్ సమాచారం, జూలై 19:
జన్నారం మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ భవనంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే బొజ్జు పటేల్‌పై బిఆర్ఎస్ నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా జన్నారం మండల మాజీ అధ్యక్షులు గుర్రం రాజారాం రెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా ప్రతినిధులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యానికి నాలుగవ స్తంభమైన మీడియాపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని, వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని మీడియాకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు (కేసీఆర్) గురించి మాట్లాడే స్థాయి ఎమ్మెల్యేకు లేదని, ఇకపై బిఆర్ఎస్ పార్టీని లేదా పార్టీ నాయకులను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని, తగిన విధంగా సమాధానం చెబుతామని హెచ్చరించారు. జన్నారం మండలం మరియు పరిసర ప్రాంతాల్లో ఇసుక కొరత తీవ్రంగా ఉందని, దీనివల్ల సామాన్య ప్రజలు ఇళ్లు నిర్మించుకోలేక ఇబ్బందులు పడుతున్నారని రాజారాం రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉండి ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఫారెస్ట్ శాఖ అధికారులు స్పందించి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఇసుక సమస్యను తక్షణమే పరిష్కరించాలని బిఆర్ఎస్ నేతలు కోరారు. ఈ మీడియా సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు మున్వర్ అలీ ఖాన్, భరత్, చెట్టుపల్లి సత్యం, రాములు నాయక్, శ్రీనివాస్ గౌడ్, జాడి గంగాధర్, పేరం శ్రీనివాస్, కళ్లెం శ్రీనివాస్ రెడ్డి, ప్రేమ్ సాగర్, ఇప్ప రాకేశ్, బాదవత్ సాయికిరణ్, ఇప్ప మహేష్, అప్పని సాయి, దుమ్మల ఎల్లయ్య, బచ్చల శివ, ఐలవేణి రవి తదితరులు పాల్గొన్నారు.