ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 02 September 2026, 2:32 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ఏకగ్రీవానికి నో అగ్రీ…

విజయవాడ, సెప్టెంబర్ 2,అర్జున్ సమాచారం:
ఏకగ్రీవం వద్దు అని మరోసారి స్పష్టం చేశారు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్. అది కూడా తన సొంత జిల్లా సొంత ప్రాంతం పులివెందుల వేదికగా ఆయన బిగ్గర స్వరం వినిపించారు. ఏకగ్రీవాలు అన్న మాటే వద్దు అని వైసీపీ లీడర్ ని క్యాడర్ ని ఆదేశించారు. ప్రతీ చోటా వైసీపీ పోటీ చేసి తీరాల్సిందే అని కూడా జగన్ గట్టిగానే దిశా నిర్దేశం చేశారు. దాంతో ఏపీలో ఏకగ్రీవాల విషయంలో బిగ్ వార్ కూటమి వర్సెస్ వైసీపీగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకే రోజున అటు ప్రభుత్వ అధినేత చంద్రబాబు ఏకగ్రీవాలు అన్నవి అవసరమని ఆహ్వానించారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు సభలో బాబు ఏకగ్రీవాల మీద కీలక వ్యాఖ్యలు చేశారు. దానికి ధీటుగా పులివెందుల నుంచి జగన్ పోటీ ఉండాల్సిందే అంటున్నారు.  త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను వైసీపీ నేతలు అంతా ఒక చాలెంజ్ గా తీసుకోవాలని జగన్ కోరారు. ఆయన పులివెందులలో పార్టీ నేతల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అసలు ఎక్కడా ఏకగ్రీవం అన్నదే వద్దు, దానికి అసలు చాన్స్ ఇవ్వవద్దు అని చెప్పారు. ప్రతీ చోటా ప్రతీ సీటుకూ వైసీపీ పోటీ పడి తీరాల్సిందే అని కూడా జగన్ అన్నారు. ఇక అధికార పార్టీ నుంచి బెదిరింపులు వచ్చినా లేదా పోలీసులను ప్రయోగించినా దౌర్జన్యాలకు పాల్పడినా కూడా వైసీపీ శ్రేణులు ధైర్యంగా ఎదుర్కోవాలని జగన్ కోరారు. భయపడకండి అన్ని విధాలుగా పార్టీ అండగా ఉంటుంది అని జగన్ భరోసా ఇచ్చారు. అంతే కాదు వైసీపీ హయాంలో జరిగిన మేలుని, ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని ఆయన కోరారు. ఏకగ్రీవాలు మేలు అని గ్రామ స్థాయిలో కక్షలు కార్పణ్యాలకు తావు లేకుండా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అంటున్నారు. ప్రభుత్వాలే వాటిని ప్రోత్సహిస్తూ వస్తున్నాయని కూడా ఆయన వివరంగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఏకగ్రీవాలు అన్నవి గతంలో జరిగినవే అన్న సంగతిని కూటమి నేతలు గుర్తుకు తెస్తున్నారు. ఇక అధికారంలో ఏ పార్టీ ఉంటే వీలుగా ఏకగ్రీవాలు చేసుకోవడం ఎప్పటి నుంచో జరుగుతూ వస్తోంది. అలాంటిది అసలు ఏకగ్రీవం అన్న మాటే వినిపించకూడదని జగన్ ఒకటికి పదిసార్లు చెబుతున్నారు. అంటే పోటీకి వైసీపీ సై అంటోంది. అలాంటి పరిస్థితి ఉంటే కనుక అది గ్రామ స్థాయిలో కానీ పల్లెలలో కానీ ఒక రాజకీయ సమరానికే దారి తీస్తుందని అంటున్నారు. ఢీ అంటే ఢీ అంటూ రాజకీయం సాగి ప్రశాంత వాతావరణం వేడెక్కిపోతుంది అని అంటున్నారు.నిజంగా పోటీకి మరో పక్షం సిద్ధంగా ఉంటే అది ప్రజాస్వామిక విధానంగా చూడాలి. అలా కాకుండా పోటీని అనివార్యం చేయడం తగదన్న మాట వినిపిస్తోంది. అలాగే పోటీకి సిద్ధంగా ఎవరైనా ఉంటే ఏకగ్రీవం పేరుతో వారి గొంతు నొక్కే తీరు మంచిది కాదని అంటున్నారు. ఏది ఏమైనా ఏపీ అంతటా ఒకేలా రాజకీయం ఉండదు, స్థానికంగా ఉండే పరిస్థితుల బట్టి అది మారుతూ ఉంటుంది. అందువల్ల ఏకగ్రీవాలు వద్దు అని వైసీపీ బిగ్ సౌండ్ చేసినా అలాగే కావాలని కూటమి కోరినా అది స్థానిక పరిస్థితులను విశేషంగా ప్రభావితం చేస్తుందని అంటున్నారు. ఎక్కడికక్కడ లోకల్ గా ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిన ఎన్నికలను ప్రతిష్టగా మార్చాలనుకుంటే భీకర పోరుకు నాంది పలికినట్లు అవుతుందని అంటున్నారు.
=======================