కరీంనగర్,అర్జున్ సమాచారం:
నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ‘స్వచ్ఛతా హీ సేవా–2026’ కార్యక్రమం గురువారం ఘనంగా ప్రారంభమైంది. మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ పాలకవర్గ సభ్యులతో కలిసి పోస్టర్, ఫ్లెక్సీని ఆవిష్కరించారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెలరోజుల పాటు అన్ని డివిజన్లలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కరీంనగర్ను క్లీన్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. గార్బేజ్ పాయింట్ల తొలగింపు, వీధులు–పర్యాటక ప్రాంతాల శుభ్రత, తడి–పొడి చెత్త వేర్పాటుపై అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు. సఫాయి మిత్రుల కోసం ఆరోగ్య శిబిరాలు, హెల్త్ కార్డులు, బీమా, పిపిఈ కిట్ల పంపిణీ వంటి చర్యలు చేపడతామని తెలిపారు. ప్రజలు స్వచ్ఛతా కార్యక్రమాల్లో భాగస్వాములై నగర పరిశుభ్రతకు సహకరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.