కరీంనగర్,అర్జున్ సమాచారం:
తెలంగాణ పోలీసు శాఖ ఆధ్వర్యంలో 3వ జోనల్ లెవల్ పోలీస్ డ్యూటీ మీట్–2026 జూలై మంగళవారం, నేడు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో నిర్వహించబడుతున్నాయని సీపీ తెలిపారు.
ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ.ఈ డ్యూటీ మీట్లో జోన్-3 పరిధిలోని కరీంనగర్, సిద్ధిపేట, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన మొత్తం 91 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొంటున్నారన్నారు. యూనిట్ వారీగా కరీంనగర్ నుంచి 24 మంది, సిద్ధిపేట నుంచి 19 మంది, రాజన్న సిరిసిల్ల నుంచి 21 మంది, కామారెడ్డి నుంచి 13 మంది, మెదక్ నుంచి 14 మంది హాజరవుతున్నారని తెలిపారు.
ఈ డ్యూటీ మీట్ పోలీసు సిబ్బందిలో వృత్తి నైపుణ్యాలను పెంపొందించడం, శాస్త్రీయ దర్యాప్తు పద్ధతులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, సమర్థవంతమైన సేవల అందింపులో మరింత నైపుణ్యం సాధించేందుకు వేదికగా నిలవనుందని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా శాస్త్రీయ దర్యాప్తు యాంటీ సబోటేజ్ చెక్, డాగ్ స్క్వాడ్ పోటీలు, కంప్యూటర్ అవగాహన, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అంశాల్లో పోటీలు నిర్వహించి, ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని మల్టీ జోనల్ స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారని సీపీ తెలిపారు.
పోటీల్లో విజేతలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకాల ప్రకారం బంగారు పతక విజేతలకు రూ.3 లక్షలు, మూడు అడ్వాన్స్ ఇన్క్రిమెంట్లు, వెండి పతక విజేతలకు రూ.2 లక్షలు, రెండు అడ్వాన్స్ ఇన్క్రిమెంట్లు, కాంస్య పతక విజేతలకు రూ.1 లక్ష, ఒక అడ్వాన్స్ ఇన్క్రిమెంట్ అందజేయబడతాయి. అలాగే జట్టు విజేతలకు నగదు ప్రోత్సాహకాలు కూడా అందజేయనున్నారని అన్నారు.
ఈ డ్యూటీ మీట్ను కేవలం పోటీగా కాకుండా వృత్తి నైపుణ్యాలను మెరుగుపరుచుకునే అవకాశంగా భావించి, క్రమశిక్షణ, అంకితభావం, సేవా తత్వంతో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చాలని సూచించారు. ఈ డ్యూటీ మీట్ ద్వారా పోలీసు శాఖలో సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యం, సమన్వయం మరింత బలోపేతమై ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించేందుకు దోహదపడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఏసీపీలు శ్రీనివాస్ జి, వేణుగోపాల్, వెంకటస్వామి, ఇతర జిల్లాల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
==========================