ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 07 July 2026, 7:19 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ట్రాన్స్‌ఫార్మర్ వద్ద విద్యుదాఘాతంతో రైతు మృతి.. ముత్తారంలో విషాదం

పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, జూలై 07: ముత్తారం మండల కేంద్రానికి చెందిన రైతు మారం వెంకట్ రెడ్డి మంగళవారం ఉదయం విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. స్థానికుల కథనం ప్రకారం, గ్రామ సమీపంలోని వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఫ్యూజ్ వైర్ సరిచేసే ప్రయత్నంలో 11 కేవీ విద్యుత్ సరఫరా ఉండటంతో ఆయనకు ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగిలింది. తీవ్రంగా గాయపడిన వెంకట్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
ఈ ఘటన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. మృతి చెందిన రైతు కుటుంబం వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తోందని గ్రామస్తులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.
విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద భద్రతా ప్రమాణాలు పాటించాలని, విద్యుత్ శాఖ సిబ్బంది కాకుండా ఎవరూ మరమ్మతుల పనులు చేపట్టరాదని స్థానికులు సూచించారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుని తగిన ఆర్థిక సహాయం అందించాలని గ్రామస్తులు కోరారు.