ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 08 July 2026, 4:29 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

డిస్ట్రిబ్యూటరీ కెనాల్ భూసేకరణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్

భద్రాచలం,అర్జున్ సమాచారం:
సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పరిధిలో ములకలపల్లి మండలం ములకలపల్లి గ్రామంలో జరుగుతున్న డిస్ట్రిబ్యూటరీ కెనాల్ భూసేకరణ సర్వే పనులను జిల్లా కలెక్టర్ అంకిత్, క్షేత్రస్థాయిలో పరిశీలించి భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
ములకలపల్లి గ్రామంలో 160 ఎకరాల భూమికి సర్వే నిర్వహించాల్సి ఉండగా, ఇప్పటివరకు 22 ఎకరాల సర్వే పూర్తయినట్లు అధికారులు వివరించారు. మిగిలిన సర్వేను ప్రణాళికాబద్ధంగా చేపట్టి నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, భూసేకరణ సర్వేలో ఎలాంటి జాప్యానికి తావులేకుండా పనులు వేగవంతం చేయాలని, క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదురైతే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించాలని సూచించారు.
ప్రతి భూ యజమానికి సంబంధించిన వివరాలతో పాటు బోర్లు, సాగులో ఉన్న పంటలు, ఆయిల్ పామ్ తోటలు, ఇతర శాశ్వత ఆస్తుల వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని, భూసేకరణ ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో రెవెన్యూ, ఇరిగేషన్, సర్వే శాఖ అధికారులు పాల్గొన్నారు.
=========================