ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 30 July 2026, 8:11 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ప్ర‌జ‌లంద‌రూ అప్రమత్తంగా ఉండాలి. పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్

హైదరాబాద్‌,అర్జున్ సమాచారం:
భారీ వర్షాల నేపథ్యంలో ప్ర‌జ‌లంద‌రూ అప్రమత్తంగా ఉండాలని  పోలీసు కమిషనర్  వీసీ సజ్జనర్,  సూచించారు.

వాతావరణ కేంద్రం విడుదల చేసే సమాచారాన్ని, హెచ్చరికలను ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తూ, వర్ష సూచనల ఆధారంగా తమ రోజువారీ ప్రయాణాలను ముందస్తుగా ప్లాన్ చేసుకోవడం మంచిదని ఆయన చెప్పారు.

వర్షాల నేపథ్యంలో గురువారం పంజాగుట్ట, ఖైరతాబాద్ జంక్షన్ల వద్ద వాహనాల రాకపోకలను, రోడ్డుపై ట్రాఫిక్ పరిస్థితులను సీపీ స్వయంగా పరిశీలించి, విధుల్లో ఉన్న అధికారులకు పలు సూచనలు చేశారు.

నగరంలో వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు పోలీసు శాఖ.. జీహెచ్‌ఎంసీ సహా ఇతర అన్ని ప్రభుత్వ విభాగాలతో పూర్తి సమన్వయంతో పనిచేస్తోందని తెలిపారు.

క్షేత్రస్థాయిలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.

వర్షం కురుస్తున్న సమయంలో తెరిచి ఉన్న మ్యాన్‌హోళ్లు, తెగిపడిన విద్యుత్ వైర్లు, స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు.

నీరు ఎక్కువగా నిలిచే లోతట్టు ప్రాంతాలు, ఫ్లైఓవర్ల వద్ద వాహనదారులు వేగం తగ్గించి జాగ్రత్తగా ప్రయాణించాలన్నారు.

వాతావరణ కేంద్రం రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతోందని, ఈ నేపథ్యంలోఅత్యవసరమైతే తప్ప వర్షం పడుతున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో లేదా ట్రాఫిక్ సహాయం కోసం ప్రజలు డయల్ 100ను సంప్రదించాలని సూచించారు.

ప్ర‌జ‌ల సౌకర్యార్థం నగర ట్రాఫిక్ పోలీసు విభాగం ఎప్పటికప్పుడు సోషల్ మీడియా, ఇతర మీడియా ద్వారా విడుదల చేసే అడ్వైజరీలను ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు.
==============================