భీమారం(మంచిర్యాల), అర్జున్ సమాచారం, జూలై 14:
భీమారం గ్రామపంచాయతీలో సర్పంచ్ ఉస్కమల్ల విజయలక్ష్మి పున్నంచందు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓటు ఎస్ఐఆర్ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది. నిన్నటి వరకు గ్రామంలో కేవలం 15 శాతం మాత్రమే నమోదు కావడంతో, సర్పంచ్ స్పందించి గ్రామస్థులందరూ గ్రామపంచాయతీ కార్యాలయానికి వచ్చి, సర్ ఫారాలు నింపి తమ ఓటును కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
సర్పంచ్ పిలుపుతో భీమారం ప్రజలు పెద్ద ఎత్తున గ్రామపంచాయతీ కార్యాలయానికి తరలివచ్చారు. దీంతో ఈరోజు నాటికి ఓటు నమోదు ప్రక్రియ దాదాపు 50 శాతానికి చేరుకుంది.ఎస్ఐఆర్ కార్యక్రమం రేపు, ఎల్లుండి (మరో రెండు రోజులు) కూడా ఇదే విధంగా కొనసాగుతుందని భీమారం సర్పంచ్ ఉస్కమల్ల విజయలక్ష్మి తెలిపారు. గ్రామపంచాయతీలో బీఎల్ఓలు , పంచాయతీ సిబ్బంది అందరూ అందుబాటులో ఉంటారని, కాబట్టి ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ డిప్యూటీ తహశీల్దార్ , గ్రామ పంచాయతీ సెక్రెటరీ, పంచాయతీ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, బీఎల్ఓలు, మరియు వార్డు సభ్యులు పాల్గొని ప్రజలకు సేవలందించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన రెవెన్యూ, పంచాయతీ సిబ్బందికి, అలాగే పెద్ద ఎత్తున తరలివచ్చిన గ్రామ ప్రజలకు సర్పంచ్ ఉస్కమల్ల విజయలక్ష్మి పున్నంచందు ధన్యవాదాలు తెలియజేశారు.