ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 02 September 2026, 8:21 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ములుగు జిల్లా పాలంపేటలోని ‘గొల్లల గుడి’కి జాతీయ ప్రాధాన్య కట్టడంగా గుర్తింపు • భారత పురావస్తు అధ్యయన విభాగం (ఏఎస్‌ఐ) అధికారిక పత్రికా ప్రకటన

అర్జున్ సమాచారం:                                                                                                                                 తెలంగాణలోని ములుగు జిల్లా, పాలంపేటలో గల ‘గొల్లల గుడి’ని జాతీయ ప్రాధాన్య కట్టడంగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీచేసింది.
ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ పరిధిలోని భారత పురావస్తు అధ్యయన విభాగం (ఏఎస్‌ఐ)  జారీ చేసిన 31.08.2026 నాటి ప్రకటన నం.ఎస్‌.ఒ.4802(ఇ) ‘గెజిట్ ఆఫ్ ఇండియా’  (ప్రత్యేక సంచిక) పార్ట్‌- IIలోని సెక్షన్‌ 3 ఉప సెక్షన్‌ (ii) కింద ప్రచురితమైంది. “ప్రాచీన కట్టడాలు-పురావస్తు ప్రదేశాలు-అవశేషాల చట్టం-1958” (1958నాటి 24వ చట్టం)లోని సెక్షన్ 4, ఉప-సెక్షన్ (3) కింద సంక్రమించిన అధికారాల మేరకు ‘ఏఎస్‌ఐ’ ఈ ప్రకటన జారీ చేసింది.
ములుగు జిల్లా పాలంపేట గ్రామంలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం ‘కాకతీయ రుద్రేశ్వర’ (రామప్ప) ఆలయానికి నైరుతి దిశలో ఈ ‘గొల్లల గుడి’ ఉంటుంది. ఇది తూర్పు ముఖంగా గల మండపం, దాని చుట్టూ మూడు గర్భాలయాలతో కూడిన ‘త్రికూటాలయం’గా కనిపిస్తుంది. దీని ప్రహరీ శిల్పాలంకృతమై, పైకప్పు అంచు నిర్మాణం, ద్వారబంధాల వద్ద చెక్కిన హంసల వరుసతో, ‘సునిశిత రంధ్రాల వల’ పనితనంతో ఈ ఆలయం ఎంతో విశిష్టమైనదిగా అలరారుతోంది.
ఈ ప్రధాన గుడికి ముందు వైపున రెండు ప్రత్యేక ఉప ఆలయాలు ఎంతో అందంగా చెక్కిన ద్వారపాలకుల విగ్రహాలతో అలంకృతమై ఉంటాయి. వీటికి ముందు గల అంతరాలయాల అంచులు కూడా చక్కని తెరలతో శోభాయమానంగా కనిపిస్తాయి.
ప్రధాన ఆలయ నిర్మాణం ముందు భాగాన మండపం గుండా మధ్యలో గల ప్రధాన మందిరానికి మార్గం ఉంటుంది. దీనికి ఉత్తర, దక్షిణ, పశ్చిమ దిశలలో అంతరాలయాలతో మూడు గర్భాలయాలు కూడా ఉంటాయి. ఆలయ కుడ్యాలపై కనిపించే వివిధ గూళ్లలో విష్ణుమూర్తి, లక్ష్మి, గణేశుడు, మహిషాసురమర్దిని విగ్రహాలు దర్శనమిస్తాయి. జంతువుల ఆకారాలు, పుష్పాలంకరణతో కూడిన ఎత్తయిన వేదికపై ఈ ఆలయం నిర్మితమైంది
=========================