ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 30 July 2026, 7:43 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

రాజ్యసభలో పబ్లిక్ పరీక్షల సవరణ బిల్లుకు ఆమోదం

న్యూఢిల్లీ, జూలై 30,అర్జున్ సమాచారం:
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారాలపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. ఇప్పటికే లోక్‌సభ ఆమోదం పొందిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అక్రమ పద్ధతుల నివారణ) సవరణ బిల్లు, 2026ను కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే వారిని ఏమాత్రం సహించబోమని, పేపర్ లీకేజీల పట్ల తమ ప్రభుత్వం ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అవలంబిస్తోందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.ప్రశ్నాపత్రాల లీకేజీని ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణిస్తోందని ఆయన పేర్కొన్నారు. దేశంలోని విద్యార్థులు, యువత ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు ఈ బిల్లూ ఒక నిదర్శనమని ఆయన తెలిపారు. ఈ చట్టాన్ని తీసుకురావడంలో ప్రధానమంత్రి ఏమాత్రం జాప్యం చేయలేదని కేంద్రమంత్రి వెల్లడించారు.
ఈ సవరణ బిల్లు నిబంధనల ప్రకారం, పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన వ్యక్తులకు కనీసం ఐదేళ్ల నుంచి గరిష్ఠంగా పదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ. 50 లక్షల వరకు జరిమానా విధించనున్నారు. ఒకవేళ వ్యవస్థీకృత నేరాలకు పాల్పడితే, కనీస శిక్షను ఏడేళ్లకు పెంచడంతో పాటు జరిమానాను రూ. 10 కోట్ల వరకు విధించేలా ప్రతిపాదించారు. దర్యాప్తును రెండు నెలల్లో పూర్తి చేసి, ఛార్జిషీట్ దాఖలు చేసిన మూడు నెలల లోపు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా విచారణ ముగించాలని ఈ బిల్లు నిర్దేశిస్తోంది.
బిల్లుపై జరిగిన చర్చలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నీట్ పేపర్ లీక్ అనంతరం ఎందరో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ప్రభుత్వం ముందస్తు నివారణ చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి, తద్వారా ప్రధానమంత్రి మోదీ కుర్చీని కాపాడారని ఖర్గే వ్యాఖ్యానించారు.
=============