ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 23 July 2026, 7:45 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

రామవరం మాతా-శిశు ఆరోగ్య కేంద్రాన్నితనిఖీ చేసిన కలెక్టర్

భద్రాచలం,అర్జున్ సమాచారం:
మాతా-శిశు ఆరోగ్య సేవల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అంకిత్   వైద్య అధికారులను ఆదేశించారు.
రామవరం మాతా-శిశు ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేసి ఆసుపత్రి ఆవరణ, ఓపీ విభాగం, ప్రసూతి వార్డులు, లేబర్ రూమ్, శిశు వార్డు, ఔషధ నిల్వ గది తదితర విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాలు, రోగులకు అందుతున్న చికిత్సపై వైద్యులతో సమీక్షించారు.
చికిత్స పొందుతున్న గర్భిణీలు, బాలింతల ఆరోగ్య పరిస్థితి, వైద్య పరీక్షలు, మందుల పంపిణీ, పోషకాహార సదుపాయాలు, ప్రసవాల సంఖ్యపై వివరాలు తెలుసుకున్న జిల్లా కలెక్టర్, ప్రభుత్వం అందిస్తున్న అన్ని సేవలు లబ్ధిదారులకు సకాలంలో చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తరువాత  రోగుల నమోదు వివరాలు, ప్రసవాల రికార్డులు, ఔషధ నిల్వలు, విధి నిర్వహణ రిజిస్టర్లు, సిబ్బంది హాజరు నమోదును క్షుణ్ణంగా పరిశీలించి, ప్రతి ఉద్యోగి సమయపాలన పాటిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగిని ఆప్యాయంగా పలకరించి, అవసరమైన వైద్య సేవలను ఎలాంటి ఆలస్యం లేకుండా అందించాలని, గర్భిణీలు, బాలింతలు, నవజాత శిశువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా వైద్య సేవలు అందుబాటులో ఉండాలని వైద్యులు, నర్సింగ్ సిబ్బందికి సూచించారు.
ఆసుపత్రి ప్రాంగణం, వార్డులు, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని, ఆసుపత్రి పరిశుభ్రతపై ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంచేలా నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, వైద్యులు, నర్సులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ రోగులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.