ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 12 September 2026, 8:21 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

విదేశీ మారక నిల్వల్లో ఫోర్త్ పోజిషన్ రష్యాను అధిగమించిన భారత్

బెంగళూరు సెప్టెంబర్ 12,అర్జున్ సమాచారం:
భారతదేశ ఆర్థిక వ్యవస్థ మరో కీలక మైలురాయిని అందుకుంది. ఆర్బీఐ చేపట్టిన ప్రత్యేక పథకం కారణంగా దేశంలోకి డాలర్ల ప్రవాహం రికార్డు స్థాయిలో పెరగడంతో, విదేశీ మారక నిల్వలు (ఫారెక్స్ రిజర్వ్స్) ఆల్-టైమ్ గరిష్ఠానికి చేరాయి. దీంతో ఫారెక్స్ నిల్వలు కలిగిన దేశాల జాబితాలో రష్యాను అధిగమించి భారత్ ప్రపంచంలోనే నాలుగో స్థానానికి ఎగబాకింది.’బ్లూమ్‌బర్గ్’ డేటా ప్రకారం.. సెప్టెంబర్ 4తో ముగిసిన వారంలో భారత ఫారెక్స్ నిల్వలు ఏకంగా 44.9 బిలియన్ డాలర్లు పెరిగి, 785.7 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 75,07,796 కోట్లు) రికార్డు స్థాయికి చేరాయి. ఈ భారీ పెరుగుదలతో ఇప్పటివరకు నాలుగో స్థానంలో ఉన్న రష్యాను భారత్ వెనక్కి నెట్టింది. ప్రస్తుతం ఈ జాబితాలో చైనా, జపాన్, స్విట్జర్లాండ్ మాత్రమే భారత్ కంటే ముందున్నాయి.ఆర్బీఐ ఈ ఏడాది జూన్ 8న ప్రవేశపెట్టిన ఫారెన్ కరెన్సీ నాన్-రెసిడెంట్ (బ్యాంక్) డిపాజిట్ల (FCNR-B) స్పెషల్ స్వాప్ పథకానికి అనూహ్య స్పందన లభించడమే ఈ డాలర్ల వరదకు ప్రధాన కారణంగా నిలిచింది. ఈ పథకం ద్వారా కేవలం 11 వారాల్లోనే దేశంలోకి 73 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు వ‌చ్చాయి. నిర్దేశిత లక్ష్యం గడువు కంటే ముందే నెరవేరడంతో, ఆర్బీఐ ఈ పథకాన్ని సెప్టెంబర్ 30కి బదులుగా ఆగస్టు 31నే ముగించింది. అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గడంతో దేశ పసిడి నిల్వల విలువ 2.59 బిలియన్ డాలర్లు తగ్గినా, డాలర్ల ప్రవాహం అధికంగా ఉండటంతో మొత్తం నిల్వలు భారీగా పెరిగాయి.విదేశీ మారక నిల్వలు ఇంత భారీగా పెరగడం దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠ‌తకు సంకేతమని, ఇది రూపాయి విలువలో హెచ్చుతగ్గులు వచ్చినప్పుడు స్థిరీకరించేందుకు ఆర్బీఐకి మరింత బలాన్ని ఇస్తుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.