ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 07 July 2026, 4:27 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

విశాఖపట్నంలో ఎల్ జీ ఎలక్ట్రానిక్స్ జీసీసీ ఏర్పాటు చేయండి ఎల్ జీ ఎలక్ట్రానిక్స్ గ్లోబల్ సీఈవో ల్యూ జె చెయోల్, ఇండియా సీఈవో హాంగ్ జు జియోన్ లతో మంత్రి లోకేష్ భేటీ

సియోల్ (సౌత్ కొరియా),అర్జున్ సమాచారం:
ఎల్ జీ ఎలక్ట్రానిక్స్ (గ్లోబల్) సీఈవో ల్యూ జె చెయోల్ (Mr. Lyu Jae Cheol), ఎల్ జీ ఎలక్ట్రానిక్స్ (ఇండియా) సీఈవో హాంగ్ జు జియోన్ (Mr. Hong Ju Jeon)లతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్ లోని ఎల్ జీ ట్విన్ టవర్స్ లో విడివిడిగా భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ఎల్ జీ ఎలక్ట్రానిక్స్ నోయిడా, బెంగళూరు ప్రాజెక్టులను విస్తరిస్తూ విశాఖపట్నంలో ఒక ఇంజనీరింగ్ సెంటర్/జీసీసీ ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. శ్రీసిటీ, దాని పరిసర ప్రాంతాల్లో డిస్‌ప్లే మాడ్యూల్స్, సెన్సార్లు, పవర్ ఎలక్ట్రానిక్స్ మొదలైన వాటి విడిభాగాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని కోరారు. ఐఓటీ, రోబోటిక్స్‌పై ఇన్నోవేషన్ ల్యాబ్‌లను అభివృద్ధి చేయడానికి ఆర్‌టీఐహెచ్‌తో కలిసి పనిచేయాలని కోరారు. క్యారియర్ (Carrier) సంస్థ తరహాలో వాణిజ్య ప్రయోజనాల కోసం చిల్లర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఏర్పాటుచేయాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు.

ఎల్ జీ ఎలక్ట్రానిక్స్ (ఇండియా) సీఈవో హాంగ్ జు జియోన్ మాట్లాడుతూ… ఎల్ జీ ఎలక్ట్రానిక్స్ (ఇండియా) భారతదేశ రిఫ్రిజిరేటర్ మార్కెట్ లో సుమారు 28%, వాషింగ్ మెషీన్లలో 33.5% వాటాను కలిగి ఉంది, ఎయిర్ కండిషనర్లలో రెండవ స్థానంలో ఉందని తెలిపారు. 1997లో భారతదేశ మార్కెట్ లోకి ప్రవేశించిన ఎల్ జీ ఇండియా గ్రేటర్ నోయిడా (యూపీ), రంజన్ గావ్, పూణే (మహారాష్ట్ర)లలో ప్లాంట్లను నిర్వహిస్తోంది. కొత్తగా ఏపీలోని శ్రీసిటీలో రూ. 5,000 కోట్ల వ్యయంతో 3వ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మిస్తోంది. దీనిద్వారా సుమారు 1,500 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

ఈ ఏడాది చివరినాటికి శ్రీసిటీ యూనిట్ ద్వారా వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించాలని భావిస్తున్నాం. దీనిద్వారా ఏసీ కంప్రెసర్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు ఉత్పత్తి చేస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తాజా ప్రతిపాదనలను పరిశీలిస్తామని హాంగ్ జు జియోన్ తెలిపారు. ఈ సమావేశంలో ఎల్ జీ ఇండియా సీఎఫ్ఓ డాంగ్ మ్యుంగ్ సియో (Mr. Dong Myung Seo), సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ కన్నా (Mr. Atul Khanna), శ్రీసిటీ ఫ్యాక్టరీ ప్రొడక్షన్ లీడర్ హెయో సుంగ్ (Mr. Heo Sung) పాల్గొన్నారు
=================