తిరుమల సెప్టెంబర్ 2,అర్జున్ సమాచారం:
కిలీ వెబ్సైట్ల గురించి తిరుమల శ్రీవారి భక్తులను టీటీడీ మరోసారి అప్రమత్తం చేసింది. గదుల కేటాయింపు పేరుతో ఆకర్షణీయమైన ప్రకటనలు ఇస్తూ.. పోస్టర్లు, తప్పుడు హామీలతో భక్తులను మోసం చేస్తున్న 249 నకిలీ వెబ్సైట్లను ఈ సంవత్సరం ఇప్పటివరకు గుర్తించినట్లు టీటీడీ తెలిపింది. ఆ ఫేక్ వెబ్సైట్లను తొలగించామని.. రెండు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసినట్లు తెలిపింది. ఆన్లైన్లో టీటీడీ పేరుతో కనిపించే నకిలీ వెబ్సైట్లు, లింక్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని భక్తులను హెచ్చరించింది. శ్రీవారి దర్శనం, వసతి, సేవలు, టోకెన్ల విషయాల్లో దళారులను నమ్మి మోసపోవద్దని.. తిరుమలకు సంబంధించిన అన్ని సేవలు, నిబంధనలు, మార్గదర్శకాలపై అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.దర్శనం, గదుల కేటాయింపు అంటూ మోసాలకు పాల్పడుతున్న దళారులపై ఈ ఏడాది ఇప్పటివరకు 30 క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు టీటీడీ వెల్లడించింది. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన 43 మంది టీటీడీ ఉద్యోగులపైనా క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. తిరుమలకు వచ్చే భక్తులు తమ సూచనలు, నిబంధనలు పాటిస్తూ.. భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో స్వామివారిని దర్శించుకోవాలని సూచించింది.ఇక తిరుమలకు వచ్చే వెంకన్న భక్తులు తమ వెంట తీసుకువచ్చే వస్తువులపైనా టీటీడీ కీలక సూచనలు చేసింది. తిరుమలకు వచ్చే వాహనాల్లో నిషేధిత వస్తువులను తరలించకుండా అలిపిరి, శ్రీవారిమెట్టు వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు టీటీడీ తెలిపింది. నిషేధిత వస్తువులను గుర్తిస్తే.. అలిపిరి టోల్గేట్ స్కానింగ్ కేంద్రం వద్దనే సీజ్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ సంవత్సరం ఇప్పటివరకు అలిపిరి వద్ద 261 డ్రోన్లు, 105 మెటా స్మార్ట్ గ్లాసెస్ను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు టీటీడీ వెల్లడించింది. తిరుమల క్షేత్రంలో భద్రత, గోప్యతను దృష్టిలో పెట్టుకుని శ్రీవారి భక్తులు.. డ్రోన్లు, స్మార్ట్ గ్లాసెస్ వంటి రికార్డింగ్ పరికరాలను తమ వెంట తీసుకురావద్దని విజ్ఞప్తి చేసింది.తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతోందన్న టీటీడీ.. పరిమితికి మించి వస్తున్నప్పటికీ, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించింది. వైకుంఠ ఏకాదశి, రథసప్తమి, బ్రహ్మోత్సవాలు వంటి సమయాల్లో భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేలా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించింది. నిర్దేశిత సమయానికే భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేలా అన్ని విభాగాలు సమిష్టిగా, ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది.
భారీగా పెరిగిన లడ్డూల విక్రయం
తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. గత ఆరు నెలలుగా కొండపై భక్తుల రద్దీ పెరిగింది.. ముఖ్యంగా వీకెండ్, సెలవు రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువా కనిపిస్తోంది. టీటీడీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తోంది. తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలి వస్తుండటంతో స్వామివారి హుండీకి భారీగా ఆదాయం సమకూరుతోంది. గత రెండు, మూడు నెలలుగా వెంకన్నకు కాసుల వర్షం కురిసింది. తాజాగా ఆగస్టు నెలలోనూ స్వామివారికి భారీగా ఆదాయం వచ్చింది.తిరుమల శ్రీవారిని ఆగస్టు నెలలో 24,56,017 మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తులు వేంకటేశ్వరస్వామివారికి రూ.137.44 కోట్లు కానుకల రూపంలో సమర్పించారు. అలాగే1.30 కోట్ల లడ్డూలను విక్రయించారు. 10.50 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఆగస్టు నెలలో ఏకంగా మూడుసార్లు హుండీ ఆదాయం రూ.5 కోట్లు దాటింది. ఆగస్టు 18న అత్యధికంగా 6.12 కోట్ల ఆదాయం సమకూరింది. ఆగస్టు 16న అత్యధికంగా 97,014 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. ఆగస్టు 15న అత్యధికంగా 53,090 మంది తలనీలాలు సమర్పించారు. ఆగస్టు 19 నుంచి 28 మధ్య రద్దీ తీవ్రంగా ఎక్కువగా ఉంది.. ఆ సమయంలో దర్శనానికి గరిష్ఠంగా 24 గంటల వరకు సమయం పట్టింది.మరోవైపు రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో కారీరిష్టి యాగం, వరుణజపం, పర్జన్యశాంతి హోమాలు సోమవారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ కెఎస్ఎస్.అవధాని ఆధ్వర్యంలో 32 మంది వేద, శ్రౌత, స్మార్థపండితులు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో యాగాలు, జపాలు, పారాయణాలు నిర్వహిస్తున్నారు. ఆరుగురు ఋత్వికులు కారీరిష్టి యాగం చేపడుతున్నారు. 12 మంది ఋత్వికులు గోగర్భం తీర్థంలో నడుము లోతు నీళ్లలో నిల్చుని వరుణ, పర్జన్య మంత్రాలను పఠించారు. అదేవిధంగా ఏడు వేద శాఖలకు చెందిన 14 మంది ఋత్వికులు రామాయణం, భాగవతం, మహాభారతంలోని విరాటపర్వం పారాయణం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వేద విజ్ఞాన పీఠం అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.టీటీడీ తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో సెప్టెంబరు 4న గోకులాష్టమి వేడుకలను భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించనున్నారు. శ్రీకృష్ణ జన్మదిన వేడుకలకు గోసంరక్షణశాల ఆధ్యాత్మిక వేదికగా నిలవనుంది. భక్తిభావాన్ని పెంపొందించేలా గోపూజతో పాటు వేదపఠనం, భజనలు, కోలాటాలు, సంకీర్తనలు, హరికథ తదితర కార్యక్రమాలను టీటీడీ నిర్వహించనుంది. గోకులాష్టమి రోజున ఉదయం 5 గంటలకు శ్రీ వేణుగోపాలస్వామివారికి అభిషేకం, 6 గంటలకు వేణుగానం, 7.30 గంటలకు వేదపఠనం నిర్వహిస్తారు. టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు కళాకారులచే భజనలు, కోలాటాలు, ఉదయం 8 గంటలకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులచే శ్రీహరి సంకీర్తనలు ఆలపిస్తారు. ఉదయం 10 గంటలకు శ్రీ వేణుగోపాలస్వామివారి సన్నిధిలో గోపూజ, హారతి నిర్వహిస్తారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. భక్తులకు స్వామివారి దర్శనం, ప్రసాదం పంపిణీ చేస్తారు. సాయంత్రం టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణుని దివ్య లీలలు, గోసేవ మహత్యాన్ని వివరించే హరికథ నిర్వహించనున్నారు.
=====================