ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 11 July 2026, 7:02 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

హైదరాబాద్ నుంచి ఎమిరేట్స్ A-380 సర్వీసు

అర్జున్ సమాచారం  :      హైదరాబాద్ నుంచి ఎమిరేట్స్ A-380 సర్వీసులను ప్రారంభించడానికి ఎమిరేట్స్ విమానయాన సంస్థ సుముఖత వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి ని ఎమిరేట్స్ విమానయాన సంస్థ (ఇండియా –  నేపాల్) వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ సర్హన్  మర్యాదపూర్వకంగా కలిశారు.

ఎమిరేట్స్ విమానయాన సంస్థ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారు ముఖ్యమంత్రి తో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో ఎమిరేట్స్ A-380 సర్వీసులను ప్రారంభించడంతో పాటు సంస్థ విమాన సర్వీసులను మరిన్ని పెంచాలని ముఖ్యమంత్రి  కోరారు.

తెలంగాణలో వరంగల్, ఆదిలాబాద్ రెండు కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు కాబోతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి  వాటి ప్రాధాన్యతను వివరిస్తూ, తెలంగాణలో ఎమిరేట్స్ MRO ఆపరేషన్స్‌ను కొనసాగించాలని కోరారు. విమాన సర్వీసులకు కావలసిన అన్ని రకాల సౌకర్యాలను కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

గచ్చిబౌలి స్పోర్ట్స్ యూనివర్సిటీలో క్రీడాకారులకు శిక్షణ అందించేందుకు స్పాన్సర్‌షిప్‌ విషయంలో కూడా ఎమిరేట్స్ ముందుకు రావాలని ముఖ్యమంత్రి  కోరారు. ముఖ్యమంత్రి  విజ్ఞప్తి మేరకు హైదరాబాద్ నుంచి ఎమిరేట్స్ సర్వీసులను ప్రారంభించడానికి మహమ్మద్ సర్హన్ సానుకూలతను వ్యక్తం చేశారు. అలాగే క్రీడాకారులను ప్రోత్సహించే విషయంలో స్పాన్సర్‌షిప్ అందించడంపైన వారు సానుకూలంగా స్పందించారు.
===========================