ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 30 June 2026, 7:23 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

జిల్లా ఎస్పీని కలిసిన మాజీ ఎంపీ భరత్ వైసీపీ బీసీ నేత పీతా రామకృష్ణపై పీడీ యాక్ట్ ఉపసంహరించాలని వినతి

రాజమహేంద్రవరం,అర్జున్ సమాచారం :
వైఎస్సార్సీపీ నగర బీసీ నాయకుడు పీతా రామకృష్ణపై పోలీసులు నమోదు చేసిన పీడీ యాక్ట్‌ను ఉపసంహరించాలని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్‌ను కోరారు. ఈ మేరకు మంగళవారం ఎస్పీ కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ, రామకృష్ణ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ అధికార పార్టీ అన్యాయాలను ప్రశ్నిస్తున్నందుకే లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. ఆయనపై 12 కేసులు నమోదు చేసి రౌడీ షీట్ తెరిచారని, హైకోర్టును ఆశ్రయించగా 10 కేసులు కొట్టివేయబడ్డాయని, కేవలం రెండు కేసులు మాత్రమే మిగిలాయని తెలిపారు.
మిగిలిన కేసులను ఆధారంగా చేసుకుని ఎమ్మెల్యే ఒత్తిడితో పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. నగరంలోని 40వ వార్డులో అధికార పార్టీకి చెందిన వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒక వర్గానికి చెందిన వారికి గాయాలయ్యాయని, బాధితుల ఫిర్యాదుపై న్యాయం చేయకుండా తిరిగి వారిపైనే కేసులు నమోదు చేశారని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు.
ప్రతిపక్ష వైసీపీ నేతలను నగరంలో తిరగనివ్వమంటూ అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు శాంతిభద్రతల సమస్యకు దారితీస్తున్నాయని భరత్ పేర్కొన్నారు.
ఇటీవల శెట్టిబలిజ సంఘీయులు వాసంశెట్టి గంగాధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, సంఘ పెద్దలు ఈ వ్యవహారంపై ఆందోళన వ్యక్తం చేశారని, న్యాయం జరగకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పిన విషయాన్ని ఎస్పీకి వివరించినట్లు తెలిపారు.
ఎటువంటి సంబంధం లేని విధంగా పీడీ చట్టం ప్రయోగించి రామకృష్ణను సెంట్రల్ జైలుకు పంపించడంతో కుటుంబం ఇబ్బందులు ఎదుర్కొంటోందని భరత్ అన్నారు. తాను వివరించిన అంశాలను పరిశీలిస్తానని ఎస్పీ సానుకూలంగా స్పందించినట్లు మాజీ ఎంపీ భరత్ తెలిపారు
======================