ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 08 July 2026, 3:59 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ఎస్ఐఆర్ కార్యక్రమం పై కలెక్టర్ సమావేశం

ఖమ్మం,అర్జున్ సమాచారం:
ఖమ్మంకలెక్టరేట్ మిటింగ్ హాల్ నందు జిల్లాకలెక్టర్ దివాకర టిఎస్, అదనపు కలెక్టర్ పి.శ్రీజ,  సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ లతో కలిసి బుధవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం పై సమావేశం నిర్వహించారు.
ప్రతి అర్హమైన పౌరుడి ఓటు హక్కును పరిరక్షిస్తూ, ఓటరు జాబితాలను మరింత పారదర్శకంగా, ఖచ్చితంగా రూపొందించడమే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ప్రధాన లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్ ఫారాలను దాదాపు పంపిణీ పూర్తి చేశామని, వాటిని తిరిగి సేకరించి ఆన్లైన్లో నమోదు చేసే డిజిటైజేషన్ ప్రక్రియను చేపట్టామని వెల్లడించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే రాజకీయ పార్టీలు, బూత్ లెవల్ ఏజెంట్లు (BLAs), బూత్ లెవల్ అధికారులు (BLOs), ప్రజలు సమిష్టిగా సహకరించాలని కోరారు.
గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రతి ఓటరికి ఎస్ఐఆర్ ప్రక్రియపై పూర్తి సమాచారం చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓటర్లు ఇంటి వద్ద అందుబాటులో ఉండి తమ వ్యక్తిగత వివరాలను సక్రమంగా అందించడం ద్వారా ఎన్నికల జాబితాల శుద్ధీకరణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
అన్మ్యాప్డ్ ఓటర్లు నిర్దేశించిన 11 ధృవీకరణ పత్రాల్లో ఏదో ఒక పత్రాన్ని సమర్పించాలని, అవసరమైన పత్రాలు సమర్పించిన వారి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేలా ఎన్నికల యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు. ముసాయిదా ఓటరు జాబితాలో పేరు లేకపోయినా, వివరాల్లో పొరపాట్లు ఉన్నా తప్పనిసరిగా అభ్యంతరాలు నమోదు చేయాలని, లేనిపక్షంలో ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉంటుందని ప్రజలకు సూచించారు. అర్హత కలిగిన ప్రతి ఓటరు జాబితాలో ఉండేలా, ఎవరి ఓటు హక్కు కోల్పోకుండా చూసే బాధ్యత అందరికీ ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
రాజకీయ పార్టీలు తమ ప్రతి బీఎల్ఏ సంబంధిత పార్టీ జారీ చేసిన గుర్తింపు కార్డు కలిగి ఉండాలని తెలిపారు. బీఎల్వోలు, బీఎల్ఏలు పరస్పర సమన్వయంతో పనిచేసి సమస్యలు, సందేహాలను వెంటనే ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో బీఎల్వోలకు అదనపు సహాయక సిబ్బందిని కూడా నియమించినట్లు వెల్లడించారు.
ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటరు జాబితా పునాది అని, ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రజలు, రాజకీయ పార్టీలు, ఎన్నికల సిబ్బంది అందరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ పిలుపునిచ్చారు.
===========================