ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 17 July 2026, 8:16 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ఒక సంకల్పం ఒక సేవా యజ్ఞం ప్లాస్టిక్ రహిత హుస్నాబాద్‌ స్టీల్ బ్యాంక్ ఏడాది విజయగాథ హుస్నాబాద్

హుస్నాబాద్,అర్జున్ సమాచారం:
ప్రజల భాగస్వామ్యంతో పచ్చని హుస్నాబాద్ దిశగా అడుగులు పడుతున్న స్టీల్ బ్యాంక్ కార్యక్రమానికి ఏడాది పూర్తి మంత్రి పొన్నం ప్రభాకర్.
పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యం, ప్లాస్టిక్ రహిత గ్రామాలు అనే మూడు ప్రధాన లక్ష్యాలతో ప్రారంభించిన “స్టీల్ బ్యాంక్” కార్యక్రమం విజయవంతంగా ఒక సంవత్సరం పూర్తి చేసుకుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్లాస్టిక్ రహిత హుస్నాబాద్ లక్ష్యంతో ప్రారంభమైన ఈ వినూత్న కార్యక్రమం నేడు ప్రజా ఉద్యమంగా రూపుదిద్దు కోవడం ఆనందదాయకమని మంత్రి పేర్కొన్నారు.
స్వర్గీయ పొన్నం సత్తయ్య సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ, ఆయన జ్ఞాపకార్థం పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో, స్వంత నిధులతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా గత సంవత్సరం జూలై 17 ప్రారంభమైన ఈ కార్యక్రమం నేడు గ్రామాల్లో పర్యావరణ చైతన్యానికి ప్రతీకగా నిలిచిందన్నారు.
ప్లాస్టిక్ వినియోగాన్ని కేవలం నిషేధించడం కాకుండా, దానికి శాశ్వత ప్రత్యామ్నాయాన్ని అందించాలనే ఆలోచనతో గ్రామ మహిళా సంఘాల ద్వారా స్టీల్ బ్యాంకులను ఏర్పాటు చేశామని మంత్రి వివరించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని 276 గ్రామ మహిళా సమైక్య సంఘాలకు మొత్తం 276 స్టీల్ బ్యాంక్ సెట్లను పూర్తిగా ఉచితంగా అందించామని తెలిపారు. ఒక్కో సెట్‌లో 13 రకాల స్టీల్ పాత్రలు ఉండేలా, 300, 400, 500 పాత్రల సామర్థ్యంతో గ్రామాల అవసరాలకు అనుగుణంగా పంపిణీ చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా 7,376 స్వయం సహాయక సంఘాలకు చెందిన 80,633 మంది మహిళా సభ్యులు ప్రత్యక్షంగా లబ్ధి పొందుతున్నారని తెలిపారు. ఈ మహత్తర కార్యక్రమం కోసం రూ.2.54 కోట్లకు పైగా స్వంత నిధులను వెచ్చించడం సేవా దృక్పథానికి నిదర్శనమన్నారు.
గ్రామాల్లో జరిగే వివాహాలు, శుభకార్యాలు, అన్నదానాలు, గ్రామసభలు వంటి కార్యక్రమాల్లో ప్లాస్టిక్ పాత్రలకు బదులుగా స్టీల్ పాత్రల వినియోగం విస్తృతంగా పెరిగిందని మంత్రి తెలిపారు. దీంతో ప్లాస్టిక్ వ్యర్థాలు గణనీయంగా తగ్గి గ్రామాలు మరింత పరిశుభ్రంగా మారాయని పేర్కొన్నారు.
=================================