ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 19 July 2026, 1:13 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

భీమారం మండల కేంద్రంలో ప్రజాధనం వృథా: బృహత్ ప్రకృతి వనం, క్రీడా ప్రాంగణం ధ్వంసంపై భగ్గుమంటున్న ప్రజలు అభివృద్ధి అంటే కూల్చడం కాదు.. ఉన్నదాన్ని కాపాడటమేనన్న బిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు రాజకుమార్ కలగూర

భీమారం (మంచిర్యాల), అర్జున్ సమాచారం, జూలై 19: 
 ప్రభుత్వం మారిన ప్రతిసారీ గత ప్రభుత్వం చేపట్టిన పనులను, ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడం రాజకీయ సంప్రదాయంగా మారిందని, ఇది ప్రజల సొమ్ముకు చేస్తున్న ద్రోహమని భీమారం బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు రాజకుమార్ కలగూర విమర్శించారు. గత ప్రభుత్వం ప్రజల పన్నుల సొమ్ముతో సుమారు ₹25 లక్షల వ్యయంతో 10 ఎకరాల్లో అభివృద్ధి చేసిన బృహత్ ప్రకృతి వనాన్ని, మరో ₹3–4 లక్షలతో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాన్ని ప్రస్తుత పాలకులు తొలగించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వం నిర్మించిన ప్రకృతి వనం, క్రీడా ప్రాంగణాన్ని తొలగించేందుకు ప్రస్తుత గ్రామ పంచాయతీ పాలకులు సుమారు ₹3 లక్షల ప్రజాధనాన్ని వృథా చేశారని రాజకుమార్ ఆరోపించారు. 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రకృతి వనాన్ని అలాగే ఉంచి, అందుబాటులో ఉన్న మిగిలిన ఖాళీ భూమిని క్రీడా ప్రాంగణం కోసం ఉపయోగించే అవకాశం ఉన్నప్పటికీ, ఉద్దేశపూర్వకంగానే గతంలో అభివృద్ధి చేసిన ప్రాంతాన్ని ధ్వంసం చేశారని ఆయన మండిపడ్డారు.
పర్యావరణానికి తీవ్ర నష్టం
ప్రకృతి వనంలోని వందలాది చెట్లను నరికివేయడం ద్వారా పర్యావరణానికి తీరని నష్టం వాటిల్లిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు ‘హరిత తెలంగాణ’ అంటూ పచ్చదనం పెంచుతామని గొప్పలు చెబుతూనే, మరోవైపు స్వయంగా పెంచిన వనాన్ని నేలమట్టం చేయడం పాలకుల ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.