ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 25 July 2026, 5:45 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

తెలంగాణలో ట్రాఫిక్..రోడ్డు భద్రత బ్యూరో ఏర్పాటు : సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్

హైదరాబాద్,అర్జున్ సమాచారం:
రాష్ట్రంలో ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రత పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఒక బ్యూరోను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రవాణా వ్యవస్థను సమగ్రంగా అధ్యయనం చేసి ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రత పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసే బ్యూరోకు సంస్థాగత నిర్మాణం ఉండాలని చెప్పారు.
ముఖ్యమంత్రి  తెలంగాణ ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రతపై ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలోని బోధి పెవిలియాన్‌లో ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రతీ 2 లేదా 3 నెలలకోసారి ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు తీసుకోవాల్సిన చర్యలపై  సమీక్షించాలని ఈ సందర్భంగా అధికారులకు చెప్పారు.
ట్రాఫిక్ వ్యవస్థలో నిబంధనలకన్నా క్రమబద్ధీకరణపై ఎక్కువ దృష్టి సారించాలని, వాతావరణంలో వచ్చే మార్పులు, కార్యాలయాల పనివేళలు, రద్దీ సమయాలు, స్థానిక సంస్కృతిని దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
కొత్తగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి ముందే ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అవసరమైన అధ్యయనం జరగాలని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాలు జరగకుండా నియంత్రణ చర్యలు పటిష్టం చేయాలని, ఓఆర్ఆర్ పై ఇష్టానుసారంగా వాహనాలు నిలపకుండా నిరంతరం పర్యవేక్షణ జరగాలని ఆదేశించారు.
హైదరాబాద్ నగరంలో స్మార్ట్ సిగ్నలింగ్ విధానంపై సమగ్రంగా అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. సిగ్నల్ ఫ్రీ వ్యవస్థను తీసుకురావడానికి అవసరమైన చోట అండర్‌పాస్‌లు, ఎలివేటెడ్ కారిడార్‌లను నిర్మించాల్సిన అవసరం ఉందని, సాధ్యమైనంత వరకు సిగ్నళ్ల వద్ద ట్రాఫిక్ నిలిచిపోకుండా వాహనాల రాకపోకలు నిరంతరాయంగా కొనసాగేలా చూడాలని సూచించారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు పి.సుదర్శన్ రెడ్డి,కె.రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు,డీజీపీ సీవీ ఆనంద్ తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.