ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 28 July 2026, 7:14 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

పొగాకు రైతుల నిరసన కార్యక్రమం రైతు సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు

ప్రకాశం జిల్లా, అర్జున్ సమాచారం:           
పొగాకు రైతులు చేపట్టనున్న నిరసన కార్యక్రమం నేపథ్యంలో, మంగళవారం జిల్లా పోలీస్ క్యాంపు కార్యాలయంలో రైతు సంఘాల నాయకులతో జిల్లా ఎస్పీ  హర్షవర్ధన్ రాజు మరియు పోలీసు అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ  మాట్లాడుతూ, శాంతియుతంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు ప్రతి ఒక్కరికీ హక్కు ఉన్నప్పటికీ, నేషనల్ హై రోడ్డు దిగ్బంధం చేయడం, ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగించడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కార్యక్రమాలకు పోలీసు శాఖ నుంచి ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు.

రైతుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లే ప్రక్రియలో పోలీసు శాఖ అవసరమైన సహకారం అందిస్తుందని తెలిపారు. నిరసన కార్యక్రమంలో పోలీసుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని, అసాంఘిక శక్తులు చొరబడే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని రైతు సంఘాల నాయకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అలాగే, జాతీయ రహదారులు దిగ్బంధం చేయకుండా, సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ పద్ధతుల్లో తమ నిరసనను వ్యక్తం చేయాలని సూచించారు. ప్రస్తుతం సెక్షన్–30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున, శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరారు. దీనికి స్పందించిన రైతు సంఘాల నాయకులు, శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా, పోలీసు శాఖ సూచనలను పాటిస్తూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో ఒంగోలు డీఎస్పీ ఆర్. శ్రీనివాసరావు, దర్శి డీఎస్పీ బాలమురళికృష్ణ, సంబంధిత సీఐలు పాల్గొన్నారు.
============================