కరీంనగర్,అర్జున్ సమాచారం:
కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పోలీసులు నకిలీ విద్యార్హత ధ్రువపత్రాన్ని ఉపయోగించి పై స్థాయి ప్రభుత్వ ఉద్యోగం పొందిన వ్యక్తిని అరెస్ట్ చేశారు.
విచారణలో నిందితుడు నలిగేటి తిరుపతి, తండ్రి గంగయ్య, వయస్సు 33 సంవత్సరాలు, తిప్పయ్యపల్లి గ్రామం, కొడిమ్యాల్ మండలం, జగిత్యాల జిల్లా నివాసి అని, గతంలో ఇతను VRAగా పనిచేశాడు. జగిత్యాల జిల్లా పెగడపల్లి తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తూ, ప్రస్తుతం గొల్లపల్లి తహసీల్దార్ కార్యాలయానికి అటాచ్మెంట్పై విధులు నిర్వహిస్తున్నాడు.
విచారణలో నిందితుడు తాను డిగ్రీ పూర్తి చేయకపోయినప్పటికీ, భవిష్యత్తులో ఉన్నత ప్రభుత్వ ఉద్యోగం పొందాలనే ఉద్దేశంతో తన భార్యకు చెందిన డిగ్రీ లాంగ్ మెమోను ఆధారంగా తీసుకొని, అందులో తన పేరు, తండ్రి పేరు, రోల్ నంబర్ తదితర వివరాలను మార్చి నకిలీ కలర్ జిరాక్స్ డిగ్రీ మెమో తయారు చేసుకున్నట్లు అంగీకరించాడు.
తదనంతరం ప్రభుత్వం VRA/VRO వ్యవస్థను రద్దు చేసి, విద్యార్హతల ఆధారంగా ఉద్యోగాల కేటాయింపు చేపట్టిన సమయంలో, అప్పటికే VRAగా పనిచేస్తున్న నిందితుడు సదరు నకిలీ డిగ్రీ మెమోను సమర్పించి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని పొందినట్లు విచారణలో వెల్లడైంది.
నిందితుడి వద్ద నుండి నకిలీ డిగ్రీ కలర్ జిరాక్స్ మెమోతో పాటు, నకిలీ ధ్రువపత్రం తయారీకి ఆధారంగా ఉపయోగించిన అతని భార్యకు చెందిన డిగ్రీ మెమో జిరాక్స్ ప్రతులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.
ప్రభుత్వ ఉద్యోగాలు పొందేందుకు లేదా ఇతర ప్రయోజనాల కోసం నకిలీ విద్యార్హత ధ్రువపత్రాలు, నకిలీ సర్టిఫికెట్లు లేదా తప్పుడు పత్రాలను ఉపయోగించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయని పోలీసులు హెచ్చరించారు.
==============================