ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 08 August 2026, 6:37 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

బంగారు బోనం ఎత్తిన సినీ నటి, నిర్మాత నిహారిక కొణిదెల

హైదరాబాద్ నగరంలో బోనాల వేడుకలు వైభవంగా కొనసాగుతున్న వేళ, సినీ నటి, నిర్మాత నిహారిక కొణిదెల పాతబస్తీ మీరాలం మండిలోని శ్రీ మహంకాళేశ్వర దేవాలయంలో అమ్మవారికి బంగారు బోనం ఎత్తి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. వేదమంత్రాల నడుమ అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందిన అనంతరం ఆలయ అధికారులు ఆమెను ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గాజుల అంజయ్య నిహారికకు ఆలయ చరిత్రతో పాటు ఆలయ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బోనాల ఉత్సవాల విశిష్టత, సంప్రదాయాలను వివరించారు.
అనంతరం నిహారిక మాట్లాడుతూ, ప్రధాన బోనాల రోజు షూటింగ్ ఉండటంతో ఆలయానికి రాలేకపోయానని, అందుకే అమ్మవారి దర్శనానికి వచ్చినట్లు తెలిపారు. తాను హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగినప్పటికీ బోనాల సందర్భంగా మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బోనాలు ఎత్తుకుని వెళ్లే దృశ్యాలు ఎప్పుడూ తనను ఎంతో ఆకట్టుకునేవని చెప్పారు.
కొద్ది రోజుల క్రితమే “నన్ను కూడా ఎవరైనా బోనాలకు తీసుకెళ్తే బాగుండేది” అని సరదాగా అన్నానని, ఆ కోరిక ఇంత త్వరగా నెరవేరడం అమ్మవారి అనుగ్రహమేనని పేర్కొన్నారు. “అమ్మవారు ఎంతో శక్తివంతమైన దేవత. ఈరోజు దర్శనం ఎంతో ప్రశాంతంగా, ఆనందంగా జరిగింది. అమ్మవారి విగ్రహం దివ్య కాంతులతో అలరించింది. మరోసారి కూడా అమ్మవారి దర్శనం చేసుకునే అవకాశం కలగాలని కోరుకుంటున్నాను” అని నిహారిక అన్నారు.
నిహారిక ఆలయానికి వచ్చిన విషయం తెలుసుకున్న భక్తులు ఆమెతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపగా, ఆలయ పరిసరాలు సందడిగా మారాయి.
===========================