ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 09 August 2026, 3:48 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

సోషల్‌ మీడియా కేటుగాళ్లపై పోలీసుల నజర్‌ పోస్టులు పెడతామంటూ బెదిరింపులు.. డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారనే ఆరోపణలు ప్రజాప్రతినిధులు, అధికారులు, వ్యాపారులు, ప్రజలే లక్ష్యంగా వసూళ్లకు పాల్పడుతున్నారనే విమర్శలు మంథనిలో సోషల్‌ మీడియా ముసుగులో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజల డిమాండ్‌

పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 09:
సోషల్‌ మీడియా ప్రస్తుతం ప్రజల చేతిలో శక్తివంతమైన వేదికగా మారింది. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు అవినీతి, అక్రమాలను ప్రశ్నించేందుకు ఇది ఉపయోగపడుతోంది. అయితే ఇదే వేదికను కొందరు వ్యక్తులు తమ స్వప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారనే ఆరోపణలు మంథని పట్టణంలో చర్చనీయాంశంగా మారాయి. సోషల్‌ మీడియాలో పోస్టులు పెడతామని, పరువు తీస్తామని, అధికారుల దృష్టికి తీసుకెళ్తామని బెదిరిస్తూ కొందరి నుంచి డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, వ్యాపారులు, సామాన్య ప్రజలను సైతం లక్ష్యంగా చేసుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సోషల్‌ మీడియా ముసుగులో వసూళ్ల ఆరోపణలు
సమాజంలోని సమస్యలను ప్రశ్నించాల్సిన సోషల్‌ మీడియాను కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తమకు అనుకూలంగా వ్యవహరించకపోతే సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తామని బెదిరించడం, డబ్బులు డిమాండ్‌ చేయడం వంటి వ్యవహారాలు జరుగుతున్నట్లు స్థానికంగా చర్చ సాగుతోంది. ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉన్నప్పటికీ.. ఆ హక్కును బెదిరింపులు, అక్రమ వసూళ్లకు ఉపయోగించుకునే హక్కు ఎవరికీ లేదని ప్రజలు పేర్కొంటున్నారు.
పోలీసుల నజర్‌
సామాజిక మాధ్యమాలను అడ్డుపెట్టుకుని బెదిరింపులకు లేదా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులపై పోలీసులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. ఇలాంటి వ్యవహారాలకు సంబంధించి ఫిర్యాదులు అందితే పూర్తి స్థాయిలో విచారణ జరిపి, ఆధారాలు లభించిన పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎవరైనా సామాజిక మాధ్యమాల్లో పోస్టుల పేరుతో బెదిరించినా, డబ్బులు డిమాండ్‌ చేసినా భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. బెదిరింపులకు సంబంధించిన ఫోన్‌ కాల్స్‌, సందేశాలు, శబ్ద, దృశ్య రికార్డులు, సంభాషణల వివరాలను భద్రపరచుకోవడం ద్వారా దర్యాప్తుకు ఉపయోగపడే ఆధారాలు లభించే అవకాశం ఉంది.
భయపడొద్దు.. ఫిర్యాదు చేయండి
మంథని పట్టణంలో సామాజిక మాధ్యమాల ముసుగులో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు. సోషల్‌ మీడియా ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే వేదికగా ఉండాలి తప్ప.. బెదిరింపులు, వ్యక్తిగత కక్షలు, అక్రమ వసూళ్లకు వేదికగా మారకూడదని పలువురు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియా పేరుతో బెదిరింపులు, డబ్బుల డిమాండ్లకు పాల్పడుతున్న వారిపై ఫిర్యాదులు అందితే పోలీసులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.