కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: కేంగర్ల మల్లయ్య
మంచిర్యాల, అర్జున్ సమాచారం, ఆగస్టు 11 :
తెలంగాణ గని బొగ్గు గని కార్మిక సంఘం (టిజిబికేఎస్) చేపట్టిన ‘బాయిబాట’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే -7 గనిని టిజిబికేఎస్ వ్యవస్థాపక కన్వీనర్ కేంగర్ల మల్లయ్య సందర్శించారు. ఈ సందర్భంగా గనిలో పనిచేస్తున్న సీనియర్ కార్మికులు ఆయనను కలసి తమ క్షేత్రస్థాయి సమస్యలను విన్నవించుకున్నారు.
యాజమాన్యం రేజింగ్ పెంపుపై దృష్టి పెడుతున్నప్పటికీ, దానికి తగినట్లుగా కార్మికులకు సరైన రక్షణ పరికరాలు, పనిముట్లు ఇవ్వడం లేదని కార్మికులు వాపోయారు. ముఖ్యంగా డ్రిల్ బిట్లు, సేఫ్టీ షూస్, రైజింగ్ క్యాప్సూల్స్ వంటి అత్యవసర సామాగ్రి కొరత తీవ్రంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్మికుల ఫిర్యాదులపై కేంగర్ల మల్లయ్య తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ — “గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు కేవలం పైరవీలకే పరిమితమయ్యాయి. కార్మికుల భద్రతను, సంక్షేమాన్ని గాలికి వదిలేశాయి” అని ఘాటుగా విమర్శించారు.
అలాగే, మెడికల్ బోర్డు వ్యవహారంపై కూడా ఆయన మండిపడ్డారు. ఇటీవల జరిగిన మెడికల్ బోర్డులో కేవలం 20 శాతం మంది కార్మికులనే అన్-ఫిట్ చేశారని, ఇది ఎంతమాత్రం సరికాదని అన్నారు. మెడికల్ బోర్డు కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి ఒక్కరినీ అన్-ఫిట్ చేసి, వారి వారసులకు తక్షణమే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.
ఈ బాయిబాట కార్యక్రమంలో టిజిబికేఎస్ ముఖ్య నాయకులు ముదిగిరి మల్లేష్, నాగుల మోహన్ రావు, దొడ్ల సతీష్, పెండ్యాల శ్రావణ్, దాసరి అఖిల్, జక్కుల శంకర్, శేఖర్, భాస్కర్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.