అర్జున్ సమాచారం:
అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన హైదరాబాద్కు చెందిన ఓ యువకుడు అనూహ్య పరిస్థితుల్లో మృతి చెందడం కుటుంబ సభ్యులు, బంధువులను తీవ్ర విషాదంలో ముంచింది. మసాచుసెట్స్ రాష్ట్రంలోని లోవెల్ నగరంలో ఈ నెల 14న సంతోష్నగర్కు చెందిన మహమ్మద్ జాబేర్ హుస్సేన్ (27) మృతి చెందాడు. ఉన్నత విద్యను పూర్తిచేసుకుని అమెరికాలోనే ఉద్యోగం చేస్తున్న జాబేర్ భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న సమయంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ముఖ్యంగా ఆగస్టులోనే టెక్సాస్లో వివాహం జరగడం, ఆ తర్వాత కొద్దిరోజులకే ఆయన మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
సంతోష్నగర్కు చెందిన జాబేర్ హుస్సేన్ విద్యాభ్యాసంలో మంచి ప్రతిభకనబరిచారు. సివిల్ ఇంజినీరింగ్ లో ఉన్నత విద్యను అభ్యసించాలనే లక్ష్యంతో 2021లో అమెరికా వెళ్లారు. మాస్టర్స్ డిగ్రీ కోసం అమెరికాలో అడుగుపెట్టిన ఆయన తొలుత కనెక్టికట్లోని విద్యాసంస్థలో చదువును కొనసాగించారు. అక్కడ తన మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసిన అనంతరం ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నించారు. అనంతరం మసాచుసెట్స్ రాష్ట్రంలోని లోవెల్ నగరంలో ఉద్యోగంలో చేరారు. చదువుతో పాటు వృత్తిపరంగా కూడా స్థిరపడేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఆయన జీవితం అనూహ్యంగా విషాదాంతమైంది.
==========================

