ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 22 August 2026, 3:50 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

పార్థీనియం నిర్మూలనపై రైతులకు అవగాహన

పార్థీనియం నిర్మూలనపై రైతులకు అవగాహన

అర్జున్ సమాచారం | ఆగస్టు 22 | ముత్తారం రిపోర్టర్

ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామంలోని రైతువేదికలో పార్థీనియం నిర్మూలనపై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం కృషి విజ్ఞాన కేంద్రం, రామగిరి ఖిల్లా, పెద్దపల్లి వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా కృషి విజ్ఞాన కేంద్రం రామగిరి ఖిల్లాకు చెందిన వ్యవసాయ విస్తరణ శాస్త్రవేత్త డా. టి. వినోద్ కుమార్, సస్యరక్షణ విభాగం డా. వెంకన్న రైతులకు పార్థీనియం వల్ల కలిగే నష్టాలను వివరించారు. పార్థీనియం కలుపు మొక్క పత్తి, కంది పంటలతో పాటు పొలం గట్లపై అధికంగా పెరిగి పంట దిగుబడిని 35 శాతం వరకు తగ్గించే అవకాశం ఉందని తెలిపారు. పంటలకు అందాల్సిన నీరు, పోషకాలను ఈ కలుపు మొక్క వినియోగించుకోవడంతో పంట ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.

పార్థీనియం వల్ల మనుషుల్లో చర్మ సంబంధిత అలర్జీలు, శ్వాసకోశ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, పశువులకు కూడా దీని వల్ల ప్రతికూల ప్రభావాలు ఉంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు. పార్థీనియం పూత రాకముందే కలుపు మొక్కలను తొలగించి, ఖాళీ ప్రదేశాల్లో వాటిని సురక్షితంగా నిర్మూలించాలని సూచించారు. లేకపోతే పార్థీనియం వేల సంఖ్యలో విత్తనాలను వెదజల్లి భవిష్యత్తులో తీవ్ర సమస్యగా మారుతుందని హెచ్చరించారు.

రసాయన పద్ధతుల్లో 2,4-D, గ్లైఫోసేట్ వంటి కలుపు నివారణ మందులను వ్యవసాయ నిపుణుల సూచనల మేరకు ఉపయోగించి పార్థీనియంను నియంత్రించవచ్చని తెలిపారు. రైతులు ముందస్తు చర్యలు చేపట్టి పార్థీనియంను శాశ్వతంగా నిర్మూలించేందుకు కృషి చేయాలని సూచించారు.

కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శ్రీమతి జే. అనుష, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.