ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 25 August 2026, 3:00 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

పశువుల బంజరు దొడ్డి కూల్చివేతపై రైతుల ఆవేదనపంటలు వేసిన తర్వాత పశువులను ఎక్కడ ఉంచాలి.? బంజరు దొడ్డి లేక రైతులకు తీవ్ర ఇబ్బందులు

పశువుల బంజరు దొడ్డి కూల్చివేతపై రైతుల ఆవేదనపంటలు వేసిన తర్వాత పశువులను ఎక్కడ ఉంచాలి.? బంజరు దొడ్డి లేక రైతులకు తీవ్ర ఇబ్బందులు.

అర్జున్ సమాచారం బెల్లంపల్లి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 25

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలములోని బట్వాన్‌పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో రైతులు పంటలు వేసిన తర్వాత ఆవులు, ఇతర పశువులు పొలాల్లోకి వెళ్లి పంటలను మేయకుండా వాటిని ఉంచేందుకు ఉపయోగపడే పశువుల బంజరు దొడ్డిని నూతనంగా ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యులు ఎలాంటి అనుమతులు లేకుండా కూల్చివేశారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో రైతులు పంటలు వేసిన తర్వాత పశువులు పొలాల్లోకి వెళ్లి పంటలను మేస్తే రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని గ్రామస్థులు చెబుతున్నారు. గతంలో పశువులను బంజరు దొడ్డిలో ఉంచుకునే అవకాశం ఉండేదని, అయితే ప్రస్తుతం ఆ దొడ్డిని కూల్చివేయడంతో పశువులను ఎక్కడ ఉంచాలో, ఎక్కడ కట్టాలో అర్థం కాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలు వేసిన సమయంలో పశువులను స్వేచ్ఛగా వదిలితే ఇతర రైతుల పొలాల్లోకి వెళ్లే అవకాశం ఉందని, దీంతో పశువుల యజమానులు మరియు రైతుల మధ్య గొడవలు జరిగే పరిస్థితి ఏర్పడుతోందని గ్రామస్థులు పేర్కొంటున్నారు. అందుకే గ్రామంలో పశువుల కోసం ప్రత్యేకంగా ఉన్న బంజరు దొడ్డి ఎంతో అవసరమని వారు చెబుతున్నారు. అయితే గ్రామానికి ఉపయోగపడుతున్న పశువుల బంజరు దొడ్డిని ఎందుకు కూల్చివేశారని గ్రామస్థులు ప్రశ్నించగా.. “మా ఇష్టం.. మీరు ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి” అంటూ సమాధానం ఇచ్చారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ప్రజల అవసరాలకు సంబంధించిన దొడ్డిని కూల్చివేసే ముందు గ్రామస్థులకు సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉందని వారు అంటున్నారు.
ఈ విషయంపై గ్రామస్థులు ఇప్పటికే డీపీవో, ఎంపీడీవో అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అయినప్పటికీ ఇప్పటి వరకు పశువుల బంజరు దొడ్డిని తిరిగి నిర్మించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పంటలు వేసిన తర్వాత పశువులను ఎక్కడ ఉంచాలో తెలియక రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో, అధికారులు వెంటనే స్పందించి పశువుల బంజరు దొడ్డిని తిరిగి నిర్మించాలని రైతులు, గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. బంజరు దొడ్డి కూల్చివేతపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. డీపీవో, ఎంపీడీవోలకు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని గ్రామస్థులు నిర్ణయించుకున్నారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి, పశువుల బంజరు దొడ్డిని తిరిగి నిర్మించేలా చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు తెలిపారు.
రైతుల పంటలకు నష్టం జరగకుండా, పశువులకు సరైన స్థలం కల్పించేలా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.