ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 28 August 2026, 4:31 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

బొగ్గు నుంచి ‘క్రిటికల్ మినరల్స్’ దిశగా…

బొగ్గు నుంచి ‘క్రిటికల్ మినరల్స్’ దిశగా…

మంచిర్యాల, ఆగస్టు 28, (అర్జున్ సమాచారం ప్రతినిధి ఆగస్టు 28.)

బొగ్గే బంగారం అన్నది సింగరేణి నినాదం… విధానం. ఇప్పుడు బొగ్గును బంగారంగా చూడటం కాదు.. నిజమైన బంగార గనుల తవ్వకాన్ని చేపట్టబోతోంది. తెలంగాణ ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి కాలరీస్ తమ అధీనంలో  ఉన్న దేవదుర్గ గోల్డ్ కాపర్‌ బ్లాక్‌లో బంగారు తవ్వకాలు చేపట్టనుంది. ఇకపై బొగ్గుకే పరిమితం కాకుండా  బంగారం, రాగి వంటి కీలక ఖనిజాల అన్వేషణనూ చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.తెలంగాణ డిప్యూటీ, మైనింగ్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క స్వయంగా ఇవాళ దేవదుర్గ గోల్డ్‌ బ్లాక్‌ను సందర్శించనున్నారు. సింగేణి ప్రాజెక్టు పురోగతిపై బుధవారం సమీక్ష నిర్వహించిన భట్టి గోల్డ్‌ మైనింగ్ పై ఫోకస్ పెట్టారు. అందుకే ఆయన దేవదుర్గ ప్రాంతాన్ని స్వయంగా సందర్శించి అక్కడ పరిస్థితులను పరిశీలించబోతున్నారు. దేవదుర్గ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన అనుమతులు, మౌలిక వసతులు, ఇతర సహకారాల కోసం కర్ణాటక ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలని భట్టి అధికారులకు సూచించారు.సింగరేణికి బొగ్గు గనుల నిర్వహణలో దశాబ్దాల అనుభవం ఉంది. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా సంస్థ తన కార్యకలాపాలను విస్తరించడంపై ఇప్పుడు దృష్టి పెట్టింది. ప్రస్తుతం కర్ణాటకలో తమ అధీనంలో దేవదుర్గ బ్లాక్‌లో రాగి బంగారు అన్వేషణ మాత్రమే కాకుండా.. గ్రాఫైట్, లిథియం, కోబాల్ట్ వంటి కీలక ఖనిజాల అన్వేషణలోనూ అవకాశాలను  వెతకాలని సింగరేణి నిర్ణయించింది.  రాబోయే రోజుల్లో విద్యుత్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్, రిన్యూవబుల్ ఎనర్జీ రంగాల్లో క్రిటికల్ మినరల్స్‌కు ప్రాధాన్యం ఉండబోతోంది. ఇప్పటి వరకూ బొగ్గుగే పరిమితం అయిన సింగరేణి కొత్తరంగాలకు విస్తరించగలిగితే.. సంస్థకు కొత్త ఆదాయ మార్గాలు కూడా ఓపెన్ అవుతాయి. కర్ణాటకలోని దేవదుర్గ ప్రాంతంలో బంగారం, రాగి నిక్షేపాల అన్వేషణకు సింగరేణి ఇప్పటికే అడుగు పెట్టింది. 2025లో కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఆన్‌లైన్ వేలంలో SCCL ఈ  బ్లాక్‌కు L-1 బిడ్డర్‌గా నిలిచింది. ఈ ప్రాజెక్టును సింగరేణి ఎక్స్‌ప్లోరేషన్ విభాగం పర్యవేక్షణలో ముందుకు తీసుకెళ్లనుంది. ఈ గనిలో తవ్వకాలు ఎంత వరకూ లాభదాయకం, అక్కడ నిక్షేపాల పరిమాణం, నాణ్యత, జియోగ్రాఫికల్ పరిస్థితులు వంటి అంశాలపై ముందుగా అధ్యయనం చేస్తారు. ఒకప్పుడు ‘బ్లాక్ గోల్డ్’గా పిలిచే బొగ్గుతో గుర్తింపు పొందిన సింగరేణి… ఇప్పుడు నిజమైన ‘గోల్డ్’నే వెలికితీయబోతోంది. ఇది కనుక సక్సెస్‌ అయితే తెలంగాణ పాలిట ఇదొక గోల్డ్‌మైనే..!   దేవదుర్గలో భట్టి విక్రమార్క పర్యటనతో ఈ ప్రాజెక్టుపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అసలు అక్కడ ఎంత బంగారం ఉంది? ఎంత రాగి ఉంది? అన్వేషణ తర్వాత వాణిజ్యపరంగా తవ్వకాలు సాధ్యమవుతాయా? — ఈ ప్రశ్నలకు రాబోయే అధ్యయనాలే సమాధానం చెప్పనున్నాయి