ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 07 September 2026, 4:20 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

వ్యవసాయ కూలి నుంచి లేడీ డాన్ వరకు..

వ్యవసాయ కూలి నుంచి లేడీ డాన్ వరకు..

తిరుపతి, సెప్టెంబర్ 7, (అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 7.)

చిన్న గదిలో ఉంటూ.. వ్యవసాయ కూలీగా జీవితం మొదలుపెట్టిన ఓ మహిళ మాజీ మంత్రి కీలక అనుచరుడి సాయంతో లేడీ డాన్‌గా ఎదిగింది. ఆమె మదలనపల్లెకు చెందిన కోనేటి సులోచన. స్థానికంగా ‘లేడీ డాన్‌’గా చలామణి అవుతూ అనేక అక్రమాలకు పాల్పడింది. శనివారం కోనేటి సులోచన ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మాజీ మంత్రి ముఖ్య అనుచరుడితో చేతులు కలిపి వందల కోట్ల విలువైన భూములను అక్రమంగా కాజేసిన వ్యవహారం వెలుగులోకి రావడంతో.. కోర్టు ఆదేశాలతో తనిఖీలు నిర్వహించారు. మదనపల్లె డీఎస్పీ బుచ్చిరాజు ఆధ్వర్యంలో సీఐలు మోహన్‌ కుమార్, రాజారెడ్డి, మహమ్మద్‌ రఫీలతో కూడిన మూడు టీమ్‌లు నిర్వహించాయి. సులోచన నివాసంతో పాటు ఆమె సోదరుడు శ్రీనివాసులు ఇంట్లో తనిఖీలు చేశారు. పోలీసులు తనిఖీల్లో 50 రకాల కీలక ఆస్తి డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. వీటిల్లో 15 ఫోర్జరీ సంతకాలు చేసి ఉంచిన పాత ఖాళీ బాండు పేపర్లు బయటపడ్డాయి. అప్పులు ఇచ్చినట్లు నమ్మించి, వారి నుంచి బలవంతంగా ఖాళీ బాండ్లపై సంతకాలు తీసుకుని ఆస్తులు లాక్కోవడానికి వీటిని ఉపయోగించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ పత్రాలను ఫోరెన్సిక్‌ సైన్స్‌ లాబొరేటరీకి పంపినట్లు డీఎస్పీ తెలిపారు. సులోచన పేరుపై బండకమ్మమీదపల్లెలో రూ.60 కోట్ల విలువైన 502 చదరపు గజాల స్థలం, బిల్డింగ్, పొన్నూటిపాళ్యంలో 1.75 ఎకరాల భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఫోర్జరీ పవర్‌ ఆఫ్‌ అటార్నీ దస్తావేజును ఉపయోగించి 10 కోట్ల విలువైన 47 సెంట్ల భూమిని ఆక్రమించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ భూమిని మాజీ మంత్రి భార్య పేరిట 2023 జూన్‌లో  గిఫ్ట్‌డీడ్‌గా మార్చినట్లు గుర్తించారు. గతంలో కోట్ల విలువైన భూములను అక్రమంగా రాయించుకున్నారని బాధితులుచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో మదనపల్లె లేడీ డాన్ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే పోలీసుల తనిఖీలు చేస్తున్న క్రమంలో సులోచన ఇంట్లో లేదు. ఆమె విజయవాడలో ఉన్నట్లు గుర్తించారు. సులోచన ఇంట్లో స్వాధీనం చేసుకున్న పత్రాల వివరాలను ఇంట్లో ఉన్న ఆమె పిల్లలకు అందజేశారు. బాధితుడు మార్పు వెంకటేష్‌ నాయుడు ఇచ్చిన ఫిర్యాదుతో కోర్టు ఆదేశాలతో పోలీసులు తనిఖీలు నిర్వహించనట్లు సమాచారం. లేడీడాన్ సులోచనపై మదనపల్లె ఒకటో, రెండో పట్టణ, పోలీసు స్టేషన్లలో 14 క్రిమినల్‌ కేసులు, రౌడీషీట్‌ ఉండడం గమనార్హం.