ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మెషిన్జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి నీరటి రాజేశ్వరి.
మంచిర్యాల జిల్లా ప్రతినిధి, అర్జున్ సమాచారం, ఆగస్టు 21:
జిల్లాలోని వెనుకబడిన తరగతుల కులాలకు చెందిన నిరుద్యోగ మహిళలకు ఉపాధి కల్పించేందుకు “ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ పంపిణీ పథకము” క్రింద ఆటోమేటిక్ కుట్టు మిషన్ లను 100 శాతం రాయితీతో అందించేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తుల స్వీకరించడం జరుగుతుందని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి నీరటి రాజేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు టీఎస్ ఓబిఎమ్ఎస్ వెబ్ సైట్ ద్వారా సెప్టెంబర్ 13వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మహిళల వయస్సు 18 నుండి 55 సంవత్సరాల మధ్య ఉండాలని, నిరుద్యోగ మహిళలు, పేదలు, నిరాదరణకు గురైన వితంతు, ఒంటరి, వికలాంగులకు, అనాద మహిళలకు, టైలరింగ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉన్నవారికి ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందని తెలిపారు. తెల్లరేషన్ కార్డు / ఆహార భద్రత కార్డు కలిగి ఉండాలని, కనీస అక్షరాస్యత 5వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని, ఆధార్ కార్డు, కుల, ఆదాయ ధృవీకరణ పత్రము కలిగి ఉండాలని, కుటుంబ వార్షిక ఆదాయము గ్రామీణులకు 1 లక్ష 50 వేల రూపాయలు, పట్టణ వాసులకు 2 లక్షల రూపాయల లోపు ఉండాలని తెలిపారు. 2023-24 సంవత్సరంలో బి.సి. ఓకేషనల్ స్కీమ్ స్వయం ఉపాధి పథకం క్రింద ఆర్థిక లబ్ది పొందిన వారు అర్హులు కారని, పథకము మంజూరు కొరకు దరఖాస్తుదారులు డౌన్ లోడ్ చేసుకొని సంబంధిత కుల, ఆదాయ, నివాసం, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, విద్యా అర్హతలు, టైలరింగ్ శిక్షణ / అనుభవం తదితర ధృవీకరణ పత్రాలతో గ్రామీణులు మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం, పట్టణ వాసులు మున్సిపల్ కార్యాలయంలో సెప్టెంబర్ 13వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని, ఆన్లైన్ చేసిన దరఖాస్తును సంబంధిత అధికారికి సమర్పించనిచో ఆ ధరఖాస్తు పరిగణలోకి తీసుకోబడదని తెలిపారు.