2008 నుంచి సాగులో ఉన్న భూమి.. 2018లో పేరు మార్పు!5 ఎకరాల లావణి పట్టా భూమి తమకు దక్కాలని దళిత కుటుంబం ఆవేదన.
అర్జున్ సమాచారం. ఆగస్టు 21. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా.
జైపూర్ మండలం, ఆగస్టు 21:జైపూర్ మండలం గంగిపెళ్లి గ్రామంలో భూ వివాదం తీవ్ర చర్చకు దారితీసింది. 2008 నుంచి తమ కాస్తులో ఉన్న ఐదు ఎకరాల లావణి పట్టా భూమిని తమకు తెలియకుండా మరో వ్యక్తి పేరు మీదకు మార్చారని ఓ దళిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది.
కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. గంగిపెళ్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 102/H1లో 5.00 ఎకరాల లావణి పట్టా భూమి 2008 నుంచి ఎనగందుల భూమక్క పేరున ఉందని తెలిపారు. తాము ఆ భూమిని సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.
అయితే 2018లో తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, తమ అనుమతి లేకుండా సదరు భూమిని సింగం మదునయ్య పేరు మీదకు మార్చినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న అనంతరం తహశీల్దార్ కార్యాలయంలో అప్పీల్ చేసుకున్నామని తెలిపారు.
అప్పీల్ చేసుకుని పలుమార్లు అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఇప్పటివరకు తమ సమస్యకు పరిష్కారం చూపలేదని కుటుంబ సభ్యులు వాపోయారు. ఎన్నో సంవత్సరాలుగా తమ కాస్తులో ఉన్న భూమిపై హక్కు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
భూమికి సంబంధించిన పాత రికార్డులను పరిశీలించి, 2008 నుంచి ఉన్న కాస్తు వివరాలను పరిగణనలోకి తీసుకుని న్యాయం చేయాలని బాధిత కుటుంబం అధికారులను కోరింది. సంబంధిత అధికారులు సమగ్రంగా విచారణ జరిపి భూ వివాదానికి శాశ్వత పరిష్కారం చూపాలని వారు విజ్ఞప్తి చేశారు.