పొక్కుర్లో పల్లె బాట వర్షాకాల విద్యుత్ భద్రతపై అవగాహన
చెన్నూర్ (అర్జున్ సమాచారం), ఆగస్టు 22:
గ్రామీణ ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను మరింత మెరుగుపరచడం, వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా పొక్కుర్ గ్రామంలో పల్లె బాట క్షేత్రస్థాయి కార్యక్రమాన్ని నిర్వహించారు. అసిస్టెంట్ ఇంజనీర్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో విద్యుత్ సిబ్బంది నేరుగా ప్రజలతో మమేకమై గ్రామాల్లో ఉన్న విద్యుత్ సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా విద్యుత్ భద్రతా నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఇంటా నాణ్యమైన వైరింగ్, సరైన ఎర్తింగ్ విధానాలను పాటించడం వల్ల ప్రమాదాలను అరికట్టవచ్చని అధికారులు తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలంలో విద్యుత్ పరికరాల పట్ల, వైర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తడి చేతులతో స్విచ్లను తాకకూడదని సూచించారు.
ఈ కార్యక్రమంలో లైన్మెన్ రమేష్ రెడ్డి, అసిస్టెంట్ లైన్మెన్లు ,శ్రీకాంత్, సురేష్, చిన్నాల మోహన్ రెడ్డిలతో పాటు పలువురు స్థానిక విద్యుత్ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.