ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 27 July 2026, 2:23 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

భీమారంలో ‘ప్రజావాణి’ వెలవెల

భీమారంలో ‘ప్రజావాణి’ వెలవెల

ఒక్క అర్జీ కూడా రాని వైనం

సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ప్రజల్లో తగ్గుతున్న నమ్మకం

అధికారుల అవగాహన లోపమే కారణమంటున్న స్థానికులు

భీమారం (మంచిర్యాల) అర్జున్ సమాచారం, జూలై 27 :

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ప్రజావాణి’ కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన కరువైంది. సోమవారం భీమారం మండల మండల అభిరుద్ది కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం అర్జీదారులు లేక పూర్తిగా బోసిపోయి కనిపించింది. మండల స్థాయి అధికారులు అయిన ఎం‌పిడిఓ, మండల డిప్యూటీ తహశీల్దార్, అంగన్వాడీ సూపర్ వైసర్, సెర్ప్ సిసి, ఎన్ పిడిసిఎల్ జే‌ఎల్‌ఎం , హౌసింగ్ ఏఇ, అగ్రి కల్చర్ అధికారులు ప్రజావాణి హాలులో సిద్ధంగా కూర్చున్నప్పటికీ, వినతులు సమర్పించడానికి ఒక్క బాధితుడు కూడా రాకపోవడం గమనార్హం.

గతంలో ఇచ్చిన దరఖాస్తులకు సరైన స్పందన లభించకపోవడం, పరిష్కారంలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతోనే ప్రజలు ప్రజావాణికి రావడం తగ్గించేశారని స్థానికులు పేర్కొంటున్నారు. “ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా అధికారుల నుంచి సరైన సమాధానం రావడం లేదు, మళ్లీ మళ్లీ తిరగాల్సి వస్తోంది” అని ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మండల పరిధిలో ప్రజావాణి కార్యక్రమం ఏ రోజున, ఏ సమయానికి జరుగుతుందో ప్రజల్లో సరైన అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో సరైన ప్రచారం లేకపోవడం వల్లనే అర్జీదారులు రావడం లేదని విమర్శలు వస్తున్నాయి.

ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరిస్తూ, ప్రజల్లో ఈ కార్యక్రమంపై మళ్లీ నమ్మకం కలిగిచేలా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.