రాజీవ్ గాంధీ ఆశయాలను సాధించడమే నిజమైన నివాళిమంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్.
పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 20:
భారత మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు గురువారం రామగిరి మండలం బేగంపేట్ ఎక్స్ రోడ్లోని పెట్రోల్ పంప్ వద్ద ఉన్న మంథని బ్లాక్ కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రొడ్డ బాపన్న పటేల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి తిరుపతి యాదవ్ రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలను నిర్వహించారు.
ఈ సందర్భంగా తొట్ల తిరుపతి యాదవ్ మాట్లాడుతూ దేశ అభివృద్ధి, ఆధునిక భారత నిర్మాణం కోసం రాజీవ్ గాంధీ అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. యువతకు రాజకీయాల్లో ప్రాధాన్యత కల్పించడంతో పాటు సాంకేతిక రంగంలో భారతదేశాన్ని ప్రపంచపటంలో ముందు వరుసలో నిలబెట్టేందుకు ఆయన చేసిన కృషి దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినదని పేర్కొన్నారు.
పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడం, యువతకు ఓటు హక్కు వయస్సును తగ్గించడం, సమాచార సాంకేతిక రంగానికి పునాదులు వేయడం రాజీవ్ గాంధీ దూరదృష్టికి నిదర్శనమని తెలిపారు. రాజీవ్ గాంధీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ప్రజాసేవలో ముందుకు సాగడమే ఆయనకు మనం అర్పించే నిజమైన నివాళి అని పిలుపునిచ్చారు.
ఈ జయంతి వేడుకల్లో రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.