ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 04 September 2026, 7:02 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

లాభాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబై సెప్టెంబర్   4 (అర్జున్ సమాచారం డెస్క్.)
అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపుపై ఆందోళనలు తగ్గడంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. అయితే కీలక స్థాయిల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడం, మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు మార్కెట్‌ జోరును కొంత అడ్డుకున్నాయి. విస్తృత మార్కెట్‌లో కొనుగోళ్ల మద్దతుతో స్మాల్‌క్యాప్‌ సూచీలు కొత్త జీవనకాల గరిష్ఠాలను తాకాయి.బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 362.57 పాయింట్లు (0.48 శాతం) లాభపడి 76,515.43 వద్ద ముగిసింది. ఓ దశలో 730 పాయింట్ల వరకు ఎగబాకి 76,883.14ను తాకింది. నిఫ్టీ 24.25 పాయింట్లు (0.10 శాతం) పెరిగి 23,897.70 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 24,005.75 వరకు వెళ్లింది.రంగాల వారీగా చూస్తే నిఫ్టీ మెటల్‌ సూచీ 1 శాతానికి పైగా పెరిగి అగ్రస్థానంలో నిలిచింది. బ్యాంకింగ్‌ మినహా ఆర్థిక సేవల షేర్లలోనూ కొనుగోళ్లు కనిపించాయి. మరోవైపు నిఫ్టీ ఐటీ 0.47 శాతం, ఫార్మా 0.68 శాతం, హెల్త్‌కేర్‌ 0.87 శాతం చొప్పున నష్టపోయాయి. మార్కెట్‌లో ఒడుదొడుకులను సూచించే ఇండియా వీఐఎక్స్‌ 6.24 శాతం తగ్గి 10.63కి చేరింది.ఆగస్టులో కోర్‌ ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గే అవకాశాలు ఫెడ్‌ వడ్డీ రేట్ల విషయంలో విరామం ఉంటుందనే అంచనాలను బలపరచొచ్చని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు బలమైన కంపెనీల ఆర్థిక ఫలితాలు, స్థిరమైన ఆర్థిక వృద్ధి, దేశీయ డిమాండ్‌ మార్కెట్‌పై మదుపర్ల నమ్మకాన్ని కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు. రూపాయి 0.09 శాతం బలపడి డాలర్‌కు రూ.94.48 వద్ద ట్రేడైంది. ఎఫ్‌సీఎన్‌ఆర్‌ డిపాజిట్లలోకి కొత్తగా నిధులు రావడం డాలర్‌ లిక్విడిటీకి మద్దతిచ్చింది.