మారు మూల ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలే ప్రభుత్వ లక్ష్యం.. మహదేవపూర్ సామాజిక ఆసుపత్రిని పునర్నిర్మిస్తాం.. ఆగస్టు 4న మరో ఉచిత ఆరోగ్య శిబిరం: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 01
మారు మూల ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ సామాజిక ఆసుపత్రిలో ఐడీబీఐ సహకారంతో ఎంఎన్జే ఆసుపత్రి హైదరాబాద్, ఒమేగా ఆసుపత్రి కరీంనగర్ వైద్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత క్యాన్సర్, కంటి నిర్ధారణ వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలు క్యాన్సర్ బారిన పడకుండా రాష్ట్రవ్యాప్తంగా సర్వైకల్ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందన్నారు. వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని తెలిపారు. హెల్త్ ఏటీఎం ద్వారా 64 రకాల వైద్య పరీక్షలను వేగంగా నిర్వహించే అవకాశం ఉందని, పరీక్షల వివరాలు ఐదేళ్ల వరకు భద్రంగా ఉండే విధంగా కార్డులు అందజేస్తామని చెప్పారు. కంటి పరీక్షల కోసం ప్రత్యేక యంత్రాలు, గుండె సంబంధిత సమస్యలను గుర్తించేందుకు ఈసీజీ పరికరాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు.
శిధిలావస్థలో ఉన్న మహదేవపూర్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆధునిక వసతులతో పునర్నిర్మించి ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రజల సౌకర్యార్థం ఆగస్టు 4న ఎంఎన్జే ఆసుపత్రి ఆధ్వర్యంలో మరో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.
కాటారం డివిజన్ పరిధిలో ఇప్పటివరకు 680 మందికి హైదరాబాద్లో ఉచిత కంటి శస్త్రచికిత్సలు నిర్వహించామని, మంథని నియోజకవర్గంలో 45 వేల మందికి కంటి పరీక్షలు, చికిత్సలు అందించినట్లు మంత్రి వెల్లడించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రజోపయోగ వైద్య కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. అనంతరం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వైద్య పరికరాలను పరిశీలించి, వైద్యులను శాలువాలతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐతా ప్రకాశ్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. మధుసూదన్, ఆసుపత్రుల సమన్వయ అధికారి డా. శ్రీకాంత్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజాబాబు, రాష్ట్ర సభ్యుడు దండు రమేష్, కాటారం ఆర్డీవో రవీందర్, డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, తహసీల్దార్ సత్యనారాయణ స్వామి, ఎంపీడీవో రవీంద్రనాథ్, అంకాలజిస్టు డా. సంతోష్ రెడ్డి, సర్పంచ్ హసీనా భాను అక్బర్, మార్కెట్ కమిటీ చైర్మన్ పంతకాని తిరుమల సమ్మయ్య, పీఏసీఎస్ చైర్మన్ తిరుపతి రెడ్డి, ఐడీబీఐ మేనేజర్ చంద్ర మౌళీశ్వర రెడ్డి, కాళేశ్వరం దేవస్థాన ట్రస్ట్ బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.