ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 8:05 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

హై రిస్క్ గర్భిణుల సంరక్షణపై ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ:

హై రిస్క్ గర్భిణుల సంరక్షణపై ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ:

మంచిర్యాల ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 06:

హై రిస్క్ గర్భిణుల సంరక్షణ, మాతా-శిశు మరణాల నివారణపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఆరోగ్య కార్యకర్తలకు రీ-ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

కమిషనర్ వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆర్మాన్ ఎన్జీవోకు చెందిన డాక్టర్ కె. విద్యాసాగర్, డాక్టర్ పవన్ రెడ్డి శిక్షణ అందించారు. తొలి విడతలో జిల్లాలోని 75 మంది ఆరోగ్య కార్యకర్తలకు అవగాహన కల్పించారు.

చిన్న వయస్సులో లేదా 35 ఏళ్ల తర్వాత గర్భం దాల్చడం, మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, కవల గర్భం, గతంలో సి-సెక్షన్, హెచ్ఐవీ, గుండె సంబంధిత వ్యాధులు, మలేరియా, క్షయ తదితర పరిస్థితులు హై రిస్క్ గర్భధారణగా పరిగణిస్తారని వివరించారు. ఇటువంటి గర్భిణులను ముందుగానే గుర్తించి ప్రత్యేక వైద్య సేవలు అందించడం ద్వారా మాతా-శిశు మరణాలను తగ్గించవచ్చని తెలిపారు.

గర్భిణీ నమోదు, కనీసం నాలుగు గర్భధారణ తనిఖీలు, పౌష్టికాహారం, ఆసుపత్రి ప్రసవం, ప్రసవానంతర సంరక్షణ, శిశువుకు టీకాలు, తల్లిపాలు మాత్రమే ఇవ్వడం, కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించడం వంటి అంశాలపై ఆరోగ్య కార్యకర్తలకు సూచనలు చేశారు. అలాగే జిల్లాలో అందుబాటులో ఉన్న 108, 102 అంబులెన్స్ సేవలు, తెలంగాణ డయాగ్నోస్టిక్స్ ద్వారా ఉచిత పరీక్షలను ప్రజలకు చేరవేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సూచించారు.

ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ అరుణశ్రీ, ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్కా వెంకటేశ్వర్, డీపీఎచ్‌ఎన్ ఆర్.ఎస్. పద్మ, సీఎచ్‌వోలు, డీడీఎం, డీపీఓలు, సూపర్వైజర్లు, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.