అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్ల సీజ్ , ఇద్దరిపై కేసు నమోదు —- భీమారం ఎస్.ఐ. ఏ. రాజేందర్
భీమారం(మంచిర్యాల),అర్జున్ సమాచారం, సెప్టెంబర్ 04:
అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను భీమారం పోలీసులు గురువారం రాత్రి స్వాధీనం చేసుకుని, ఇద్దరిపై కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ 03 రాత్రి 10:00 గంటల సమయంలో జైపూర్ మండలం శెట్పల్లి గ్రామ శివారులోని గోదావరి నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు భీమారం పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు చేపట్టారు. భీమారం మండలం అరేపల్లి గ్రామ శివారులో ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను గుర్తించి, వాటిని సీజ్ చేశారు.
ఈ అక్రమ రవాణాకు పాల్పడిన శెట్పల్లి గ్రామానికి చెందిన కుమ్మరి కిరణ్, తలారి హరీష్ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు.
ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలించినా, సహజ వనరులను దుర్వినియోగం చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని భీమారం ఎస్.ఐ. ఏ. రాజేందర్ హెచ్చరించారు. అక్రమ ఇసుక రవాణాపై నిరంతరం నిఘా ఉంటుందని పేర్కొన్నారు. పరిధిలోని ప్రజలు ఎవరైనా అక్రమంగా ఇసుకను తవ్వినా లేదా తరలించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని భీమారం ఎస్.ఐ. ఏ .రాజేందర్ విజ్ఞప్తి చేశారు.