కౌటాల మండల మాలి సంఘం నూతన కమిటీ ఎన్నిక:
కౌటాల(కుమురం భీమ్ ఆసిఫాబాద్), ఆగస్టు 7:
కౌటాల మండల మాలి సంఘం నూతన కమిటీని రాష్ట్ర, జిల్లా నాయకత్వం ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడిగా ఆదే శ్రీనివాస్ ఎన్నిక కాగా, మండల యువజన అధ్యక్షుడిగా మోర్లె పాండురంగ్, మహిళా అధ్యక్షురాలిగా మోర్లె పద్మ ఎన్నికయ్యారు. అలాగే సంఘానికి సంబంధించిన పూర్తి మండల కమిటీని కూడా ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ, మాలి సంఘం ఐక్యతను మరింత బలోపేతం చేయడంతో పాటు, ఎస్టీ సాధన లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు. సంఘ సభ్యుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, అభివృద్ధి కోసం సమిష్టిగా పనిచేస్తామని పేర్కొన్నారు.
నూతన కమిటీ ఎన్నిక సందర్భంగా రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి సంఘ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మండలంలోని మాలి సంఘ సభ్యులు, నాయకులు, యువజన ప్రతినిధులు, మహిళా సభ్యులు పాల్గొని నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేశారు.

