బొమ్మెన గ్రామానికి తక్షణమే రోడ్డు సౌకర్యం కల్పించాల•. సాగు భూములపై అటవీశాఖ వేధింపులు మానాలి•తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ,
వేమనపల్లి (అర్జున్ సమాచారం) ఆగస్టు 08:
మండల పరిధిలోని బొమ్మెన గ్రామానికి వెంటనే రోడ్డు సౌకర్యం కల్పించాలని, ఆదివాసీల సాగు భూములపై అటవీ శాఖ అధికారుల వేధింపులను తక్షణమే నిలిపివేయాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం మండల అధ్యక్షుడు మడే మదునయ్య డిమాండ్ చేశారు. శనివారం బొమ్మెన గ్రామంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ఆయన సంఘం జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మదునయ్య మాట్లాడుతూ… దశాబ్దాలుగా ఇక్కడే నివాసముంటున్న ఆదివాసీలకు కనీస మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వాలు పూరిగా విఫలమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్లు గడుస్తున్నా ఆదివాసీ గ్రామాలకు ఇంకా స్వేచ్ఛ, అభివృద్ధి కరువయ్యాయని అన్నారు. గ్రామానికి సరైన రహదారి లేక అత్యవసర అనారోగ్య పరిస్థితుల్లో ఆసుపత్రులకు వెళ్లలేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నరకయాతన అనుభవిస్తున్నామని వాపోయారు. కేవలం ఎన్నికల సమయంలోనే తమను ఓటు బ్యాంకుగా వాడుకుని, ఆ తర్వాత పాలకులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
తమ తరతరాల సాగు భూములపై అటవీశాఖ అధికారులు రోజురోజుకూ ఆంక్షలు పెంచుతూ వేధిస్తున్నారని, ఎంతమంది అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి అటవీశాఖ అనుమతులతో బొమ్మెన గ్రామానికి బిటి రోడ్డు నిర్మించాలని, విద్య, వైద్య వసతులు కల్పించాలని కోరారు. లేనిపక్షంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ స్ఫూర్తితో పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు సిడం పోచన్న, బట్టు పుల్లయ్య, లగ్గామ గట్టయ్య, పార్వతి, కొండయ్య, లచ్చన్న, ఓల తిరుపతి, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

