రాజాపూర్లో 300 మందికిపైగా బాధితులకు నోటీసులు జారీ
అర్జున్.సమాచారం./ఆగస్టు/12 పెద్దపల్లి.డెస్క్
మండలం.రాజాపూర్ గ్రామంలో భూసేకరణ ప్రక్రియలో భాగంగా సింగరేణి ప్రాజెక్టు నం. RPN-216కు సంబంధించి 300 మందికిపైగా గ్రామస్థులకు ప్రత్యేక ఉప కలెక్టర్ (భూ సేకరణ) కార్యాలయం నుంచి నోటీసులు జారీ చేయడం కలకలం రేపుతోంది.
బాధితుల వివరాల ప్రకారం, ప్రాథమిక నోటిఫికేషన్ (PN)లో పేర్లు ఉన్నప్పటికీ, పబ్లిక్ డిక్లరేషన్ (PD)లో తమ పేర్లు చేర్చలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ, R&R (పునరావాస & పునరుద్ధరణ) అర్హతపై నోటీసులు జారీ చేయడం అన్యాయమని బాధితులు ఆరోపిస్తున్నారు.
Joint Inspection Committee నివేదిక ఆధారంగా తమ ఇళ్లు, నిర్మాణాలను ‘ఇనెలిజిబుల్ స్ట్రక్చర్స్’గా పరిగణిస్తూ నోటీసులు ఇవ్వడాన్ని గ్రామస్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. PDలో పేరు లేకుండా నోటీసులు జారీ చేయడం చట్టబద్ధ ప్రక్రియకు విరుద్ధమని, తమ హక్కులను కాలరాస్తున్నారని వారు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో బాధితులు ప్రత్యేక ఉప కలెక్టర్ కార్యాలయానికి సామూహికంగా అభ్యంతర పత్రాలు సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు. తమ కేసులను పునఃపరిశీలించి, R&R ప్రయోజనాలు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే చట్టపరంగా పోరాటం చేస్తామని బాధితులు హెచ్చరించారు.

