మిషన్ భగీరథ పైపు లీకేజీ.. బురదమయంగా మారిన పాఠశాలల రహదారిఆశ్రమ పాఠశాల, ఎంపీపీఎస్ భీమారం ప్రాంగణాల ముందు చేరుతున్న నీరుఅస్తవ్యస్తంగా దారి.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు.
భీమారం(మంచిర్యాల),అర్జున్ సమాచారం,ఆగస్టు 21
భీమారం మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాల మరియు ఎంపిపిఎస్ భీమారం పాఠశాల ముందు ఉన్న ప్రధాన రహదారి అధ్వానంగా తయారైంది. కొన్ని రోజులుగా మిషన్ భగీరథ పైపు లీకేజీ కావడం వల్ల తాగునీరు నిరంతరం రోడ్డుపైకి ప్రవహిస్తోంది.
ఈ లీకేజీ కారణంగా దారి పొడవునా పెద్ద ఎత్తున నీరు నిలిచిపోయి, రోడ్డంతా బురద నిండిన మురికికుంటలా మారింది. దీనితో పాఠశాలలకు వచ్చే చిన్న పిల్లలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు రాకపోకలు సాగించడానికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. నడిచి వెళ్లే క్రమంలో విద్యార్థులు జారిపడే ప్రమాదం ఉందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థులు తిరిగే ఈ మార్గంలో ప్రతిరోజూ నీరు వృథాగా పోతుండటమే కాకుండా, దోమల వ్యాప్తి పెరిగే అవకాశం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. కాబట్టి, సంబంధిత మిషన్ భగీరథ మరియు పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి, పైపు లీకేజీకి అడ్డుకట్ట వేసి, రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని పాఠశాల ఉపాధ్యాయులు కోరుతున్నారు.

