అర్జున్ సమాచారం: భారత్–నేపాల్, భారత్–భూటాన్ దేశాల మధ్య ఉన్న సుమారు 2,450 కిలోమీటర్ల పొడవైన అంతర్జాతీయ సరిహద్దుకు భద్రత కల్పించే విషయంలో ఎస్ఎస్ బి సేవలు అభినందనీయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ముఖ్యంగా సరిహద్దు నిర్వహణను ఆధునికీకరించే దిశగా సశస్త్ర సీమా బల్ నిరంతరం కృషి చేస్తుండటం సంతోషదాయకమన్నారు. డ్రోన్లు, CCTV నిఘా వ్యవస్థలు, థర్మల్ ఇమేజర్లు, నైట్ విజన్ పరికరాలు, GPS ఆధారిత గస్తీ, సురక్షిత డిజిటల్ కమ్యూనికేషన్ వ్యవస్థలు, GIS ఆధారిత ప్రణాళిక వంటి ఆధునిక సాంకేతికతలను ఉపయోగించడం ద్వారా SSB తన కార్యాచరణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తుండటం అభినందనీయమన్నారు.
ఉత్తర ప్రదేశ్ పర్యటనలో భాగంగా ఈరోజు లక్నోలోని ఎస్ఎస్ బీ కేంద్రానికి వచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కు సైనిక వందనం సమర్పించారు. అనంతరం నేరుగా గోమతినగర్ లోని మోహన్ లాల్ గంజ్ లో ఉన్న సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్ బి) 4వ బెటాలియన్ లో నూతనంగా నిర్మించిన జవాన్ల బ్యారక్, సబార్డినేట్ అధికారుల మెస్, నివాస భవనాలను కేంద్ర మంత్రి ప్రారంభించారు. దీంతోపాటు గోరఖ్పూర్లోని రీజినల్ హెడ్క్వార్టర్స్, ట్రైనింగ్ సెంటర్, జాయింట్ హాస్పిటల్, మహారాజ్గంజ్లోని 22వ బెటాలియన్ భవన నిర్మాణాలకు ఆన్లైన్ ద్వారా శంకుస్థాపన చేశారు. ఆయా భవనాల నిర్మాణానికి కేంద్రం రూ.191 కోట్ల 29 లక్షలను మంజూరు చేసింది. ఆయా నిధులతో జవాన్ల బ్యారక్లు, పరిపాలనా/శిక్షణ భవనాలు, ఆసుపత్రి, సిబ్బంది నివాసాలు, రోడ్లు, STP, నీటి ట్యాంకులు, ప్రహరీ గోడలు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ తోపాటు ఎస్ఎస్ బీ ఏడీజీ రేఖా లోహాని, ఐజీలు మీనూ చౌదరి, పారుల్ జైన్, సీపీడబ్ల్యూ సీఈ హిమాంశు పాండే తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి బండి ప్రసంగంలోని ముఖ్యాంశాలు…
ఈ రోజు సశస్త్ర సీమా బల్ ముఖ్యమైన కార్యక్రమంలోని పాల్గొని పలు అభివ్రుద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం సంతోషంగా ఉంది. కేంద్ర సాయుధ పోలీసు బలగాల జవాన్లు, వారి కుటుంబాల సంక్షేమాన్ని కేంద్రంగా చేసుకున్న భారత ప్రభుత్వ ఆలోచనకు, నిబద్ధతకు నేటి ప్రారంభోత్సవాలు ప్రతీకలు. దేశ సరిహద్దుల్లో నిలబడి దేశ భద్రతను కాపాడే జవాన్ల కుటుంబాలకు కూడా సురక్షితమైన, గౌరవప్రదమైన, సౌకర్యవంతమైన జీవితం కల్పించడం ప్రభుత్వ బాధ్యతని విశ్వసిస్తున్నాం. జవానుకు తన కుటుంబ భద్రత, ఆరోగ్యం, సౌకర్యాల గురించి ఆందోళన లేకుండా ఉంటే, అతను సరిహద్దు భద్రత, దేశ సేవ అనే తన బాధ్యతలపై పూర్తి ఏకాగ్రతతో దృష్టి పెట్టగలడు.
భారతదేశ భద్రతా వ్యవస్థలో సశస్త్ర సీమా బల్ (SSB) పాత్ర ఎంతో ముఖ్యమైనది. భారత్–నేపాల్, భారత్–భూటాన్ దేశాల మధ్య ఉన్న సుమారు 2,450 కిలోమీటర్ల పొడవైన అంతర్జాతీయ సరిహద్దుకు భద్రత కల్పించే బాధ్యత ఎస్ఎస్ బిపై ఉంది. ఈ సరిహద్దు ద్వారా మాదకద్రవ్యాలు, ఆయుధాలు, మానవ అక్రమ రవాణా, అక్రమ వలసలు, నకిలీ కరెన్సీ, వన్యప్రాణుల అక్రమ రవాణాసహా ఇతర వ్యవస్థీకృత నేరాలను ప్రోత్సహించే వ్యక్తులు, సంస్థలపై ఎస్ఎస్ బీ నిరంతరం సమర్థవంతమైన కఠిన చర్యలు తీసుకుంటోంది.
గతంలో పోలిస్తే ఈ రోజుల్లో భద్రతా సవాళ్లు మరింత క్లిష్టంగా మారాయి. నేరస్థులు, దేశ వ్యతిరేక శక్తులు ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. డ్రోన్లు, సైబర్ మార్గాలు, డిజిటల్ కమ్యూనికేషన్, ఆధునిక సాంకేతిక పరికరాల వల్ల భద్రతా బలగాల ముందు కొత్త సవాళ్లు ఏర్పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆధునిక సాంకేతికతను ఉపయోగించడం మనకు అవసరంగా మారింది. సరిహద్దు నిర్వహణను ఆధునికీకరించే దిశగా సశస్త్ర సీమా బల్ నిరంతరం కృషి చేస్తుండటం సంతోషంగా ఉంది. డ్రోన్లు, CCTV నిఘా వ్యవస్థలు, థర్మల్ ఇమేజర్లు, నైట్ విజన్ పరికరాలు, GPS ఆధారిత గస్తీ, సురక్షిత డిజిటల్ కమ్యూనికేషన్ వ్యవస్థలు, GIS ఆధారిత ప్రణాళిక వంటి ఆధునిక సాంకేతికతలను ఉపయోగించడం ద్వారా SSB తన కార్యాచరణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తోందిఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ తోపాటు ఎస్ఎస్ బీ ఏడీజీ రేఖా లోహాని, ఐజీలు మీనూ చౌదరి, పారుల్ జైన్, సీపీడబ్ల్యూ సీఈ హిమాంశు పాండే తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
=========================

