గోదావరిఖని,అర్జున్ సమాచారం:
ఈరోజు అసెంబ్లీలో రామగుండం నియోజకవర్గ అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతిపై రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ మాట్లాడారు. పెద్దపల్లి జిల్లాలో ఐటీ సెంటర్ ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని స్వాగతిస్తూ, అందుకు కృషి చేస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఐటీ సెంటర్ల ఏర్పాటు కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అభినందిస్తున్నానని అన్నారు.
రామగుండం ప్రాంతానికి ఉన్న అపారమైన వనరులను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ భారీ పరిశ్రమలను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కోరారు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జెన్కోకు సంబంధించిన భూములతో పాటు రైతులకు సంబంధించిన భూములను కలుపుకుని సుమారు 1,800 ఎకరాల భూమిని సేకరించినప్పటికీ, అక్కడ పరిశ్రమ ఏర్పాటు కాలేదని ఆయన పేర్కొన్నారు.
రామగుండం ప్రాంతంలో ఎల్లంపల్లి నీరు, విద్యుత్, ఎన్టీపీసీ, బొగ్గు వంటి వనరులు అందుబాటులో ఉన్నాయని, ఇలాంటి అన్ని సౌకర్యాలు ఒకే ప్రాంతంలో ఉండటం రామగుండం ప్రత్యేకత అని ఎమ్మెల్యే తెలిపారు. అందువల్ల రామగుండంలో పెద్ద పరిశ్రమలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
అదేవిధంగా రామగుండంలో 1×800 మెగావాట్ల పవర్ ప్లాంట్ను త్వరగా ఏర్పాటు చేయాలని అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ విజ్ఞప్తి చేశారు.
గతంలో రామగుండం ప్రాంతం “మాంచెస్టర్ ఆఫ్ ఇండియా”గా పేరుగాంచిన పారిశ్రామిక ప్రాంతమని, తిరిగి రామగుండాన్ని పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేసి పూర్వ వైభవాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు.
============================

