కరీంనగర్,అర్జున్ సమాచారం:
కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో జరిగిన చేనేత పారిశ్రామిక, సహకార సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని నూతన పాలకవర్గాన్ని సన్మానించారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ, చేనేత రంగాన్ని బలోపేతం చేయడం, నేత కార్మికుల కుటుంబాలకు అండగా నిలవడం విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందన్నారు. సిరిసిల్ల చేనేత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు పండుగల సందర్భంగా పంపిణీ చేసే చీరల తయారీ బాధ్యతలను అప్పటి ప్రభుత్వం వారికి అప్పగించిందని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం వస్త్రాల టెండర్లను ఇతర రాష్ట్రాలకు అప్పగించడం వల్ల స్థానిక చేనేత కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని ఆయన విమర్శించారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే చేనేత కార్మికుల సంక్షేమానికి మరింత ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్ వాసాల రమేష్, సంఘం ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
=========================

