గురు పౌర్ణమి వేళ మంథని షిరిడి సాయిబాబా ఆలయంలో భక్తి వెల్లువ
పాదదర్శనం, గురుదక్షిణ, అన్నదానం, భజనలతో ఆధ్యాత్మిక వేడుకలు
పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, జూలై 29
గురు పౌర్ణమి సందర్భంగా మంథని పట్టణంలోని షిరిడి సాయిబాబా ఆలయంలో బుధవారం భక్తి పారవశ్యంతో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే సద్గురు షిరిడి సాయినాథుని ఆశీస్సులు పొందేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భక్తులకు సాయినాథుని పవిత్ర పాదాలను దర్శించుకునే ప్రత్యేక అవకాశం కల్పించారు. అనంతరం భక్తులు గురుదక్షిణ సమర్పించి సద్గురువు ఆశీస్సులు పొందారు. గురు పాదసేవ ద్వారా సద్గురువు అనుగ్రహం లభిస్తుందనే విశ్వాసంతో భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.
గురు పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఆలయానికి విచ్చేసిన భక్తులకు మహాప్రసాదాన్ని అందజేశారు. అన్నదాన సేవలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని సాయిసేవలో భాగస్వాములయ్యారు.
సాయంత్రం యోగిరాజ శతక పారాయణం నిర్వహించగా, అనంతరం సాయినామ సంకీర్తనలతో భజన కార్యక్రమం భక్తులను ఆధ్యాత్మిక పరవశంలో ముంచెత్తింది. చివరగా జరిగిన శేజ హారతిలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని సాయినాథుని కృపాకటాక్షాలను ప్రార్థించారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షురాలు మహావాది జలజ సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు పనకంటి మురళీధర్, ఆలయ అర్చకుడు రామడుగు సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్భంగా భక్తులకు అరుదైన ఆధ్యాత్మిక అనుభూతిని కల్పించడం ఆనందంగా ఉందన్నారు. లోకక్షేమం, సర్వజన సుఖశాంతులు, ప్రతి కుటుంబంలో ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం వెల్లివిరియాలని సద్గురు సాయినాథుని ప్రార్థించినట్లు తెలిపారు.

