హైదరాబాద్, ఆగస్టు 11, అర్జున్ సమాచారం : తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసింది. రాష్ట్రంలోని 3.38 కోట్ల మంది ఓటర్లలో దాదాపు 71 లక్షల మంది ఓటర్లు అన్కలెక్టబుల్ కేటగిరీలో ఉన్నట్లు తేలింది. ఇందులో సగానికి పైగా హైదరాబాద్,
మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోనే ఉన్నట్లు వెల్లడైంది. ఇక నేటితో ఎస్ఐఆర్ గడువు ముగియడంతో ఇప్పుడు ఫారాల పరిశీలన, ధ్రువీకరణ అనంతరం తుది ఓటర్ల జాబితా ఎలా ఉండబోతోందన్న దానిపై సర్వత్రా
తీవ్ర ఉత్కంఠ నెలకొంది.తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో కీలక ఘట్టం ముగిసింది. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించేందుకు ఇచ్చిన
గడువు ముగిసింది. దీంతో రాష్ట్రంలో దాదాపు 71 లక్షల మంది ఓటర్ల వివరాలపై ఇప్పుడు తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ ఓటర్లను అన్కలెక్టబుల్ కేటగిరీలో గుర్తించిన నేపథ్యంలో.. తుది ఓటర్ల జాబితాలో వీరి
పేర్లు కొనసాగుతాయా లేక తొలగిస్తారా అనేది కీలకంగా మారింది. తెలంగాణలో మొత్తం 3.38 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. సుమారు 70.8 లక్షల మంది ఓటర్లకు సంబంధించిన ఎన్యూమరేషన్
ఫారాలు అందుబాటులో లేని లేదా సేకరించలేని కేటగిరీలో ఉన్నట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి.ఈ సంఖ్య రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో దాదాపు 21 శాతానికి సమానమని ఎన్నికల సంఘం
గణాంకాలు పేర్కొంటున్నాయి. వీరిలో సుమారు 9.1 లక్షల మంది మరణించినవారు ఉండగా.. 10.3 లక్షల మంది గైర్హాజరు లేదా ఆచూకీ లభించని వారిగా గుర్తించారు. మరో 43 లక్షల మంది
శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలిపోయినట్లు.. 6.6 లక్షల మంది డూప్లికేట్ ఓటర్లుగా గుర్తించినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.ఇప్పటికే అన్కలెక్టబుల్ కేటగిరీలోకి వచ్చే ఓటర్ల పేర్లను తొలగించే
ప్రక్రియ ఉంటుందని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సీ. సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే గడువు ముగియగా.. ప్రక్రియ పూర్తి అయ్యే సమయానికి మరిన్ని ఎన్యుమరేషన్ ఫారాలు అందే అవకాశం
ఉండటంతో తుది తొలగింపు సంఖ్యలో మార్పు రావచ్చని భావిస్తున్నారు. ఆగస్ట్ 9వ తేదీ నాటికి సుమారు 3.2 లక్షల ఫారాలు మాత్రమే డిజిటలైజ్ కావాల్సి ఉండగా.. మిగిలిన ప్రక్రియను అధికారులు
పూర్తి చేయనున్నారు.ఎస్ఐఆర్లో అత్యధికంగా అన్కలెక్టబుల్ ఫారాలు నమోదైన ప్రాంతంగా గ్రేటర్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతం నిలిచింది. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాలు కలిపి
సుమారు 41.5 లక్షల అన్కలెక్టబుల్ ఫారాలు నమోదు అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 70.8 లక్షలతో పోలిస్తే ఇవి దాదాపు 58.6 శాతానికి సమానం.ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా పట్టణ
ప్రాంతాల్లో ఓటర్ల వివరాలను సేకరించడంలో అనేక ఇబ్బందులు ఎదురైనట్లు తెలుస్తోంది. అద్దె ఇళ్లలో ఉండేవారు తరచూ ఇళ్లను మార్చడం.. శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడం.. మూసివేసిన ఇళ్లు,
గేటెడ్ కమ్యూనిటీల్లో ఓటర్లను గుర్తించడం కష్టంగా ఉండటం, మరణించిన ఓటర్ల పేర్లు కొనసాగడం వంటి కారణాలు అన్కలెక్టబుల్ కేసులు పెరగడానికి కారణాలుగా కనిపిస్తున్నాయి.మరోవైపు ఉత్తర, పశ్చిమ
తెలంగాణలో ఓటర్ల వివరాల్లో అనామలీస్ (వివరాల్లో తేడా ఉండటం) శాతం ఎక్కువగా నమోదైంది. జిల్లా స్థాయిలో ఆదిలాబాద్లో 28.5 శాతం ఓటర్ల వివరాల్లో అనామలీస్ గుర్తించారు. నిజామాబాద్లో
27.4 శాతం, నిర్మల్లో 26.1 శాతం, మెదక్లో 24.6 శాతం, కామారెడ్డిలో 23.9 శాతం, సంగారెడ్డిలో 23.8 శాతం నమోదు అయ్యాయి. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూస్తే
ఆదిలాబాద్లో 30.4 శాతం అనామలీస్తో అత్యధికంగా ఉండగా.. నారాయణఖేడ్లో 29.3 శాతం, నిజామాబాద్ అర్బన్లో 28.4 శాతం, షాద్నగర్లో 28.3 శాతం, నిర్మల్లో 28.29
శాతం, నిజామాబాద్ రూరల్లో 28.1 శాతం నమోదయ్యాయి.ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో ఇప్పటివరకు సుమారు 2.64 కోట్ల ఎన్యూమరేషన్ ఫారాలను డిజిటలైజ్ చేసి.. బూత్ లెవల్ అధికారులు
(బీఎల్ఓలు) ధ్రువీకరించినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇది రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో 78.1 శాతానికి సమానం. ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణకు గడువు ముగియడంతో ఇప్పుడు
అధికారుల తదుపరి చర్యలపై దృష్టి నెలకొంది. ఇప్పటికే అందిన ఫారాల పరిశీలన, డేటా ధ్రువీకరణ, అభ్యంతరాలు-దరఖాస్తుల పరిశీలన వంటి ప్రక్రియల తర్వాతే తుది ఓటర్ల జాబితాలో ఎలాంటి మార్పులు
చోటుచేసుకుంటాయన్నది స్పష్టమవుతుంది.మరీ ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో భారీగా అన్కలెక్టబుల్ కేసులు.. ఉత్తర-పశ్చిమ తెలంగాణలో అధిక అనామలీస్ నమోదైన నేపథ్యంలో.. ఎస్ఐఆర్ తుది
ఫలితాలు రాష్ట్ర ఓటర్ల జాబితాపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉందని అర్థమవుతోంది. ప్రస్తుతం 71 లక్షలుగా ఉన్న అన్కలెక్టబుల్ ఓటర్ల సంఖ్యలో చివరకు ఎంతమంది పేర్లు తొలగింపునకు
గురవుతాయన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.
=========================

